Missing: మంగళగిరిలో నలుగురు విద్యార్థుల అదృశ్యం

గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

Updated : 07 Dec 2021 11:19 IST

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమవడం కలకలం సృష్టిస్తోంది. పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా ఉండే రాజీవ్ గృహకల్పకు చెందిన విద్యార్థులు వెంకటేష్, ప్రభుదేవా, సంతోష్‌.. ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. మరో విద్యార్థి వెంకటేశ్‌ ఎర్రబాలెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఉదయం స్కూల్‌కి వెళ్లి బ్యాగులు తరగతి గదిలో పెట్టి బయటకు వెళ్లిపోయారు.

మళ్లీ సాయంత్రం వచ్చి బ్యాగులు తీసుకొని వెళ్తుండగా ఉపాధ్యాయులు గమనించి పాఠశాలకు రాకుండా ఎక్కడ తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఇవాళ ఉదయం తల్లిదండ్రులను తీసుకొని పాఠశాలకు రావాలని చెప్పడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఎర్రబాలెంలోని పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థి వెంకటేశ్‌తో కలిసి మిగిలిన ముగ్గురూ సాయంత్రం 7గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని