logo

సరికాదంటే.. సాగనంపడమే!

  ఈ ఏడాది సాగునీటి కాలువల నిర్వహణ పనులకు ప్యాకేజీ టెండర్లకు ఆయన అంగీకరించలేదు. గత ఏడాది బలవంతంగా ప్యాకేజీ టెండర్లను పిలిచి మొదటి శ్రేణి గుత్తేదారులకు అప్పగించారు.

Published : 10 Jun 2023 05:34 IST

జలవనరుల శాఖలో బదిలీలలు
నచ్చిన వారికి ఇన్‌ఛార్జి బాధ్యతలు
ఈనాడు, అమరావతి

  ఈ ఏడాది సాగునీటి కాలువల నిర్వహణ పనులకు ప్యాకేజీ టెండర్లకు ఆయన అంగీకరించలేదు. గత ఏడాది బలవంతంగా ప్యాకేజీ టెండర్లను పిలిచి మొదటి శ్రేణి గుత్తేదారులకు అప్పగించారు. అవి ఇంకా కొన్ని పూర్తికాలేదు. మరికొన్ని నామమాత్రంగా చేశారు. ఇదే రిమార్కులతో ఈసారి జలవనరుల శాఖ సర్కిల్‌ కార్యాలయం ప్యాకేజీ టెండర్లకు అనుమతించలేదు. దీంతో ఆయనపై వేటు పడింది. ఆకుర్చీలో ఇన్‌ఛార్జిని నియమించి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈ అధికారిది మాత్రమే కాదు.. ఇలా జలవనరుల శాఖలో పలు బదిలీలు జరిగాయి. తమ మాట వింటే సరే.. లేకపోతే.. బదిలీనే..! అన్నట్లు నిబంధనలు బేఖాతరు చేసి అనర్హులను సైతం బదిలీ చేశారు. ఇన్‌ఛార్జులుగా బాధ్యతలు అప్పగించారు. భారీగా ధరలు కూడా పలికాయని తెలిసింది. ఏడాది కాకముందే బదిలీ చేసి కోరుకున్న పోస్టులు ఇచ్చారు. తాజాగా పలువురు ఇంజినీర్ల బదిలీలు జరిగాయి. ఓ కీలక మంత్రి, మరో కీలక అధికారి ఆధ్వర్యంలో నచ్చిన వారికి బదిలీలు చేసినట్లు తెలిసింది.

స్థాయి లేకున్నా పోస్టింగ్‌..

* విజయవాడ జలవనరుల శాఖ సర్కిల్‌ కార్యాలయం ఎస్‌ఈగా తిరుమలరావును గత ఏడాది నియమించారు. అంతకు ముందు ఇక్కడ ఉన్న అధికారి మంత్రి ఓఎస్‌డీగా వెళ్లారు. ఇంజినీరు ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో డిప్యూటీ ఈఎన్‌సీగా ఉన్న తిరుమలరావును ఇక్కడ నియమించారు. గత ఏడాది ఆయన వచ్చే సరికే పలు నిర్వహణ పనులకు టెండర్లను పిలిచారు. కొన్నింటిని రద్దు చేశారు. తర్వాత ప్యాకేజీలుగా పిలిచారు. అంతా గందరగోళం జరిగింది. నిర్వహణ పనులు ప్యాకేజీలు చేయడంతో అదనపు ప్రయోజనం ఏమీ కనిపించలేదు. ఈ ఏడాది 2023-24కు ప్యాకేజీలు చేయకుండానే టెండర్లను పిలిచారు. గత ఏడాది దాదాపు రూ.50 కోట్లు కేటాయించగా.. ఈఏడాది కేవలం రూ.30 కోట్లకే సీఏడీ అనుమతి లభించింది. దీనిపై కొంతమంది ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. దీంతో తిరుమలరావును తిరిగి ఈఎన్‌సీ కార్యాలయానికి పంపారు. ఏడాదిలోగానే వెనక్కి పంపారు.

* ఖాళీ అయిన విజయవాడ సర్కిల్‌ ఎస్‌ఈ పోస్టుకు ప్రసాద్‌ను నియమించారు. వాస్తవానికి ఆయన నూజివీడు డివిజన్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఈఈగా ఉన్నారు. ఆయనను బదిలీపై కేఈ (కృష్ణా తూర్పు) డివిజన్‌కు తీసుకువచ్చారు. ఎస్‌ఈ పోస్టు ఇన్‌ఛార్జిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక ఎస్‌ఈ పోస్టు అదనపు బాధ్యతలు అప్పగించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఖాళీలుగా చూపకనే భర్తీ...

* సాధారణ బదిలీల సమయంలో ఇన్‌ఛార్జిగా అదనపు బాధ్యతలు ఉన్న పోస్టులను ఖాళీలుగా చూపించాలి. కానీ చాలా పోస్టులు అలా ఖాళీ చూపించకుండా భర్తీ చేసినట్లు తెలిసింది. డ్రెయినేజీ విభాగం పెడన ఏఈగా సీహెచ్‌ మురళీ కృష్ణ కొనసాగుతున్నారు. ఇరిగేషన్‌ సబ్‌ డివిజను బందరకు ఆయన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా 2020 నుంచి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాధారణ బదిలీల్లో డీఈఈ పోస్టు ఖాళీగా చూపించకుండా 2022లోగానీ, ఈ ఏడాదిగానీ మరొకరికి ఇవ్వలేదు. ప్రస్తుతం ఏఈనే ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తున్నారు. కేవలం ఏఈ హోదా ఉన్న వ్యక్తిని డీఈఈగా ఇన్‌ఛార్జిగా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నిస్తున్నారు.

* నిర్వహణ పనులకు రైతుల నుంచి వసూలు చేసిన నీటితీరువా గ్రాంటు ఉపయోగిస్తారు. వీటిని కేవలం తూటికాడ, పూడిక తీత నిర్వహణ పనులకు మాత్రమే వినియోగించాలి. కానీ రైతుల నుంచి వసూలు చేసే నీటితీరువా (ఫ్లౌబాక్‌ ఫండ్సు) నిధులతో తాళ్లపాలెం మేజరు డ్రెయినుకు సీరియల్‌ నెంబరు 38, 39, 40 ప్యాకేజీ పనులకు రూ.39.50లక్షలు, రూ.39.55లక్షలు, 39.42 లక్షలు కేటాయించారు. వీటిని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు గోపినాథ్‌ తిరస్కరించారు. దీంతో ఆయన్ను కాడా (ఆయకట్టు అభివృద్ధి విభాగం) కు బదిలీ చేశారు.

* లజ్జబండ డ్రెయిన్‌ టెండరులో డ్రెడ్జింగ్‌ పనుల తప్పులను సరిచేయాలనీ.. లెవల్స్‌ తీయాలని సూచించిన ఒక ఈఈని.. గుత్తేదారు, మరో ఏఈ.. ప్రజాప్రతినిధులతో చెప్పించి బదిలీ చేయించారు. విజయవాడ డివిజను నుంచి గత ఏడాది బదిలీల్లో గుడివాడ డ్రెయినేజీ ఈఈగా కర్నె శ్రీనివాస్‌ వెళ్లారు. ప్రస్తుతం పెదలంక డ్రెయిన్‌ డ్రెడ్జింగ్‌ పనులు జరుగుతున్నాయి. దీనిలో అక్రమాలకు తావులేకుండా కఠినంగా వ్యవహరించినట్లు తెలిసింది. లజ్జబండ డ్రెయిన్‌ లెవల్స్‌ తీసిన తర్వాతే పనులు చేయాలని గుత్తేదారులకు చెప్పారు. దీంతో ఆయనకు బదిలీ జరిగింది.  

* పెడన నియోజకవర్గంలో పెదలంక డ్రెయిన్‌పై రూ.43 కోట్ల విలువైన రెగ్యులేటర్‌ నిర్మాణం టెండర్‌ నిర్వహించారు. ఇవి అగ్రిమెంటు కూడా జరగలేదు. దీన్ని రద్దు చేయించుకోవాలని గుత్తేదారు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అవరోధంగా ఉన్న ఇంజినీరుపై బదిలీ వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

* కృష్ణా డెల్టా పరిధిలో ఇంజినీర్లుగా ఉద్యోగంలో చేరి పదోన్నతులు పొందిన ఇంజినీర్లను కాదని, ఏమాత్రం డెల్టాపై అవగాహన లేని అధికారులను నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చని కొందరు గుత్తేదారులు భావిస్తున్నారని తెలిసింది. జలవనరుల శాఖలో జరిగిన బదిలీలపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. ప్రశ్నించే పరిస్థితి లేదంటున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని