logo

భూముల విలువ తగ్గించాలని ధర్నా

బహిరంగ మార్కెట్‌తో సమానంగా అసాధారణ రీతిలో పెంచిన భూముల విలువ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ దస్తావేజు లేఖరులు, రియల్టర్లు ఆందోళనకు దిగారు.

Updated : 03 Jun 2023 05:03 IST

ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

ఆందోళనకు దిగిన రియల్టర్లు, దస్తావేజు లేఖర్లు

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: బహిరంగ మార్కెట్‌తో సమానంగా అసాధారణ రీతిలో పెంచిన భూముల విలువ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ దస్తావేజు లేఖరులు, రియల్టర్లు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నినాదాలు చేశారు. స్థానికులతో చర్చించకుండా అనేక గ్రామాల్లో అసాధారణంగా విలువలు పెంచడాన్ని తప్పుబడుతూ అధికారుల తీరును నిరసించారు. శుక్రవారం ఎలాంటి దస్తావేజులు రాయకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్నం వరకు అనంతపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లను స్తంభింపజేశారు. పార్టీల సానుభూతి పరులు, దస్తావేజు లేఖర్లు, రియల్టర్లు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక కార్యాలయాలు పంపిన ప్రతిపాదనలు పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా విలువలు పెంచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖర్ల తరఫున హరినాథ్‌బాబు, నాగార్జునరెడ్డి, పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం గ్రామీణ మండలం రాచానపల్లి కన్నా కురుగుంట పొలాలపై 300 శాతం అధికంగా విలువ పెంచడం దారుణమన్నారు. ఇంత భారీగా పెంచితే రిజిస్ట్రేషన్‌ ఖర్చులు ఎలా భరిస్తారని ప్రశ్నిస్తారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విలువలు సవరించాలని డిమాండ్‌ చేశారు. రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించలేదు. జిల్లా రిజిస్ట్రార్‌ నాగభూషణం, సబ్‌రిజిస్ట్రార్‌ సత్యనారాయణమూర్తిలకు వినతిపత్రాలు సమర్పించారు.

ఆగమేఘాలపై జేసీతో సమావేశం

అసాధారణంగా భూముల విలువ పెంచడంపై ప్రజలు కన్నెర్ర చేయడంతో అధికారులు స్పందించారు. సంయుక్త కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌తో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ మాధవి, రిజిస్ట్రార్‌ నాగభూషణం, ఇతర అధికారులు సమావేశమయ్యారు. కురుగుంట, బీకే సముద్రం, సోమలదొడ్డి, ఉప్పరపల్లి గ్రామాలపై సమీక్షించారు. విలువలు తగ్గిస్తారా..? లేదా అనేది సంశయంగా మారింది.                                                                                                                                                                                                     

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని