logo

ఆరు నెలల పరిచయం... గొంతు కోసేంత పగ!

ఓ యువతి, ఓ యువకుడు.. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నగరానికి వచ్చారు. ఇద్దరికీ ఓ టీ స్టాల్‌ వద్ద పరిచయం ఏర్పడింది. ఆ కలయిక చివరికి హింసకు దారితీసింది.

Published : 08 Dec 2022 03:58 IST

హైదరాబాద్‌: ఓ యువతి, ఓ యువకుడు.. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నగరానికి వచ్చారు. ఇద్దరికీ ఓ టీ స్టాల్‌ వద్ద పరిచయం ఏర్పడింది. ఆ కలయిక చివరికి హింసకు దారితీసింది. పుట్టినరోజు నాడే యువకుడిపై యువతి పథకం ప్రకారం దాడిచేసింది. గొంతు కోసే క్రమంలో యువకుడికి చెంప కింద తీవ్రంగా గాయమైంది. ఎంతలా అంటే ఆ గాయానికి  పది... ఇరవై.. కాదు వైద్యులు 50 కుట్లు వేశారు. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన లక్ష్మీ సౌమ్య(23) బీబీఏ పూర్తి చేసి ఉద్యోగ కోసం కేపీహెచ్‌బీకి వచ్చి ఓ ప్రైవేటు వసతిగృహంలో చేరింది. సమీపంలోనే గుంటూరుకు చెందిన అశోక్‌కుమార్‌ మరో ప్రైవేటు వసతిగృహంలో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వీరిద్దరికి సమీపంలోని ఓ టీ స్టాల్‌ వద్ద పరిచయం ఏర్పడింది. ఆరు నెలల పరిచయంతో అశోక్‌ పెళ్లి చేసుకుంటానని సౌమ్యతో ప్రస్తావించాడు. ఆమె మనసులో ఏముందో తెలియదు గానీ అశోక్‌తో ప్రేమగా ఉంటున్నట్లు నటించేది. ఆమె ఉంటున్న వసతి గృహంలో గొడవలు పెట్టుకోవడంతో నిర్వాహకులు ఖాళీ చేయించారు. దీంతో మరో వసతి గృహానికి మారింది. మరోవైపు అశోక్‌  తరచూ పెళ్లి విషయం ప్రస్తావిస్తుండటంతో యువతి అతణ్ని అడ్డు తొలగించుకోవాలనుకుంది కాబోలు. ఈనెల 5న అశోక్‌ పుట్టినరోజు కావడంతో ఇద్దరూ రాత్రి 7 గంటల సమయంలో టీ స్టాల్‌ వద్ద కలిశారు. మళ్లీ పెళ్లి ప్రస్తావన వచ్చి గొడవ జరిగి అప్పటికే బ్లేడు(మినీ కట్టర్‌)తో వచ్చిన సౌమ్య... యువకుడి గొంతుపై దాడి చేయబోయింది. అతను తప్పించుకోవడంతో మెడపై, చెంప కింద లోతుగా కోసుకుని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు 50 కుట్లు వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సౌమ్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని