logo

ఆ ఇసుకంతా ప్రక్కి లంకదేనట..!

రాజంపేట నుంచి రవాణా చేస్తున్న ఇసుకంతా తాళ్లపూడి మండలం ప్రక్కిలంకదేనని అధికారులు తేల్చారు. నాణ్యత కలిగిన ఇసుకమేటలు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంపై కొంతమంది పెద్దోళ్ల కన్నుపడింది.

Published : 05 Feb 2023 05:51 IST

చేతులెత్తేసిన యంత్రాంగం
సీతానగరం, న్యూస్‌టుడే: జిల్లాలోని సీతానగరం మండలం

సీతానగరంలో ఇసుక అక్రమ తవ్వకాలతో నదీగర్భంలో ఏర్పడిన గుంత

రాజంపేట నుంచి రవాణా చేస్తున్న ఇసుకంతా తాళ్లపూడి మండలం ప్రక్కిలంకదేనని అధికారులు తేల్చారు. నాణ్యత కలిగిన ఇసుకమేటలు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంపై కొంతమంది పెద్దోళ్ల కన్నుపడింది. స్థానికంగా ఉండే నాయకులను గుప్పెట్లో పెట్టుకుని రూ.కోట్లు విలువచేసే ఇసుకను దోచుకుపోతున్నారు. రాజంపేట వద్ద అక్రమార్కులు పెరగడంతో వారి మధ్యనే పరస్పరం వివాదాలు జరుగుతున్నాయి. మూడు నెలలు నుంచి రాజంపేట వద్ద నుంచి ఇసుక తరలిపోవడంపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారయంత్రాంగం పట్టించుకోలేదు. పర్యావరణ అనుమతులు లేకుండా నదీగర్భంలోకి భారీ యంత్రాలు దించి యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్న వైనంపై ‘గోదారమ్మకు గుండెకోత’  శీర్షికన ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై అధికార యంత్రాంగం స్పందించింది శుక్రవారం దాడులు చేసింది. మూడురోజుల క్రితం మరో ఇసుక రేవు తెరిచి తవ్వకాలు మొదలుపెట్టడంతో ఇప్పటి వరకు అక్కడే పాతుకుపోయిన వారంతా జీర్ణించుకోలేకపోయారు. దీంతో జేపీ వెంచర్స్‌ ప్రతినిధులను రంగంలోకి దించి కొత్తగా తెరిచిన రేవుకు అనుమతులు లేవంటూ ఫిర్యాదు చేశారు. మూడు నెలల నుంచి రాజంపేట వద్ద తవ్వకాలు చేస్తున్నవారి అనుమతులు చూపించాలని ఎస్‌ఈబీ బృందం కోరితే లేవనే సమాధానమే వినాల్సి వచ్చింది. ఈలోగా పెద్దల ఒత్తిళ్లు పెరగడంతో యంత్రాంగం వేగం తగ్గించింది. రెండు రోజుల నుంచి సర్వే పేరుతో కాలయాపన చేస్తూ తాళ్లపూడి, కొవ్వూరు నుంచి సర్వేయర్లను రప్పించారు. సీతానగరం మండలానికి ఎటువంటి సంబంధం లేదని ఇదంతా కొవ్వూరు డివిజన్‌ పరిధిలోకి వస్తుందని రెవెన్యూ బృందం నివేదికలు ఇచ్చింది. రాజంపేట వద్ద తవ్వకాలు నిలిపివేయించామని గనులశాఖ చెప్పినా శనివారం యథావిధిగా తవ్వకాలకు పాల్పడ్డారు. శనివారం రాజమహేంద్రవరం గనులశాఖ ఏడీ ఎం.విష్ణువర్థనరావు మాట్లాడుతూ సర్వే నంబరు 33లో నదీగర్భంలో 257 ఎకరాలు పక్కిలంకలోకి వస్తుందన్నారు. సర్వేయర్‌ ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రస్తుతం రాజంపేట వద్ద గత కొంతకాలంగా తవ్వకాలు జరుగుతున్న ప్రాంతమూ తాళ్లపూడి పరిధిలోకే వస్తుందన్నారు. ఏలూరు గనులశాఖ, తాళ్లపూడి రెవెన్యూ యంత్రాంగం ఈ రేవులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని