logo

మృత్యుఘోష నిలువరిద్దాం!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానది సుమారు 260 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్‌ నుంచి పెనుమూడి వారధి వరకు పలు ప్రాంతాల్లో తీరప్రాంత ప్రజలు నదిలోకి దిగుతున్నారు.

Published : 02 Jun 2023 05:16 IST

ప్రజలకు అవగాహన కలిగేలా సూచిక బోర్డులు అవశ్యం
ఇసుక తవ్వకాలపై నిరంతర నియంత్రణ తప్పనిసరి
అధికారుల సమన్వయంతోనే ప్రమాదాల కట్టడి

ఉండవల్లి వాగులో లోతైన ప్రాంతం

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానది సుమారు 260 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్‌ నుంచి పెనుమూడి వారధి వరకు పలు ప్రాంతాల్లో తీరప్రాంత ప్రజలు నదిలోకి దిగుతున్నారు. స్థానికంగా నివాసముండే పెద్దలకు అవగాహన ఉండడంతో లోతు ప్రాంతాలకు వెళ్లకపోయినా విద్యార్థులు, పిల్లలు ఆటవిడుపుగా నదిలోకి వెళ్లి మృత్యువాత పడుతున్నారు. నదీతీరంలో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యటక ప్రాంతాలు ఉండటంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వేసవి సెలవులకు ఇళ్లకు వచ్చిన విద్యార్థులు సరదాగా నదీతీరానికి వెళ్లి అనుకోకుండా నీటిలో మునిగి తల్లిదండ్రులకు అంతులేని ఆవేదన మిగులుస్తున్నారు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసే యంత్రాంగం నిర్మాణాత్మక చర్యలు తీసుకుని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతోంది. వరుస ఘటనలు పునరావృతం కాకుండా యంత్రాంగం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ సహకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రమాదాలు జరిగే ప్రాంతాలివే...

* మాచర్ల మండలం విజయపురిసౌత్‌లోని నాగార్జునసాగర్‌ ఎగువనే కృష్ణవేణి పుష్కరఘాట్‌.

* రెంటచింతల మండలం సత్రశాల.

* గురజాల మండలం దైద.

* దాచేపల్లి మండలం తంగెడ.

* అచ్చంపేట మండలం చల్లగరిగ, పులిచింతల దిగువన మాదిపాడు, చామర్రు

* బెల్లంకొండ మండలం ఎమ్మాజిగూడెం, కోళ్లూరు, బోధనం, చిట్యాల.

* అమరావతి మండలం మునుగోడు, పొందుగల, మల్లాది, దిడుగు, ముత్తాయపాలెం, ధరణికోట, అమరావతి, వైకుంఠపురం.

* తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం, రాయపూడి, తాళ్లాయపాలెం.

* తాడేపల్లి మండలం ఉండవల్లి సమీపంలో కొండవీటి ఎత్తిపోతల పథకం వద్ద, సీతానగరం ఘాట్‌, రైల్వేవంతెన, కనకదుర్గమ్మవారధి పిల్లర్లు.

* దుగ్గిరాల మండలం పెదకొండూరు,    వీర్లపాలెం.

* కొల్లిపర మండలం మున్నంగి, కొల్లిపర, బొమ్మువానిపాలెం.

* కొల్లూరు మండలం చిలుమూరు ప్రాంతాలు ప్రమాదాలకు నిలయాలుగా ఉన్నాయి.    


ఆఖరిచూపూ దక్కని దైన్యం

కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం శివారు కృష్ణానదిలో గతేడాది అక్టోబరు 2న తెనాలికి చెందిన హర్షవర్ధన్‌ స్నేహితులతో కలిసి సరదాగా నదిలో స్నానానికి దిగారు. నదీ ప్రవాహంలో హర్షవర్దన్‌ గల్లంతయ్యాడు. అప్పట్లో ఐదు రోజుల పాటు పోలీసులు గాలించినా మృతదేహం సైతం దొరకలేదు. ఒక్కగానొక్క కొడుకు హర్షవర్దన్‌ అల్లారుముద్దుగా పెంచుకుంటే ఆఖరిచూపు కూడా దక్కలేదని తల్లిదండ్రులు యోగేశ్వరరావు, నాగమణి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.


మార్గదర్శకాల అమలు బాధ్యత ప్రభుత్వానిదే

నదిలో లోతు ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నా కొందరు యువకులు పెడచెవిన పెడుతున్నారు. ఇసుక తవ్వకాల వల్ల తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తున్నారు. వీటికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం మార్గదర్శకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉంది.

వావిలాల సుబ్బారావు, పురావస్తు పరిశోధకులు, అమరావతి


సమాచార కేంద్రంతో అప్రమత్తం చేయాలి

నది వద్ద శాశ్వత ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. దేవాలయంలో మైకు ఉన్నందున భక్తులకు నది లోతుపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయొచ్చు. స్థానికేతరులు ఎక్కువగా వస్తున్నందున ఘాట్‌ సమీపంలో ఒక సమాచార కేంద్రం ఏర్పాటు చేయాలి. నదిలో స్నానాలు ఎక్కడ చేయాలి, ప్రమాద ప్రాంతాలు ఎటువైపు ఉన్నాయన్న సమాచారం అందించాలి. ఇలా చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు.

పీసపాటి నాగేశ్వరశర్మ, ఆధ్యాత్మికవేత్త


ప్రమాదకర ప్రాంతాల్లో కంచెలు వేయాలి

నదీ తీరం వెంబడి ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అటువైపు వెళ్లకుండా కంచెలను ఏర్పాటు చేయాలి.   దీనిని గుర్తించి రక్షణ చర్యలు ఎక్కువగా తీసుకోవాలి. అధికారుల సమన్వయలోపం కారణంగా ఎటువంటి భద్రతా చర్యలు ఘాట్ల వద్ద కనిపించడం లేదు.

కోలా వెంకటేశ్వరరావు, పర్యావరణ వేత్త, అమరావతి


భద్రతా చర్యలు చేపడతాం

నదిలో ఉన్న ప్రమాదకర గోతులతో ఎవరూ దిగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతాం. ఆలయం వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసి భక్తులకు కృష్ణానదిలో స్నానాలపై తగు సూచనలు చేస్తాం. ప్రమాదకర గుంతల వద్ద శాశ్వత ప్రాతిపదికన ఉండేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.

ఏవీ బ్రహ్మం, సీఐ, అమరావతి


రేవుల వద్ద గస్తీ ఏర్పాటు

నదీతీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఆదేశిస్తాం. ప్రముఖ  పర్యటక ప్రాంతమైన అమరావతి నదీతీరంలో ఎక్కువ మంది చనిపోతున్నందున అక్కడ ప్రత్యేకమైన రక్షణ చర్యలు తీసుకునేలా చూస్తాం. ఎస్పీతో చర్చించి రేవుల వద్ద గస్తీతోపాటు కంచె ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటాం.

శివశంకర్‌ లోతేటి, జిల్లా కలెక్టర్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని