logo

కారులో వస్తాడు.. బైక్‌లు కాజేస్తాడు

దుర్వసనాలకు అలవాటుపడి బైకుల చోరీలకు పాల్పడుతున్న యువకుణ్ని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు.

Published : 08 Dec 2022 02:29 IST

కీ మేకింగ్‌ మిషన్‌ను చూపిస్తున్న ఏసీపీ పురుషోత్తంరెడ్డి, పోలీసు అధికారులు

వనస్థలిపురం, న్యూస్‌టుడే: దుర్వసనాలకు అలవాటుపడి బైకుల చోరీలకు పాల్పడుతున్న యువకుణ్ని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను ఏసీపీ పురుషోత్తంరెడ్డి బుధవారం వెల్లడించారు. హస్తినాపురం క్రిస్టియన్‌ కాలనీకి చెందిన రాకేష్‌ అలియాస్‌ రాఖి, అలియాస్‌ లడ్డు(21), డిగ్రీ మధ్యలోనే ఆపేసి అక్రమంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా బైక్‌ చోరీలకు పాల్పడుతున్నాడు. సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో రెండు వాహనాలను ఎత్తుకెళ్లి పోలీసులకు చిక్కడంతో  జైలుకు పంపారు. బయటకు వచ్చి మళ్లీ 13 బైకులను చోరీ చేశాడు.

నకిలీ తాళాలతో.. రాకేష్‌కు, వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో ఉంటూ నకిలీ తాళంచెవిలను తయారుచేసే ఎండీ సొహైల్‌ఖాన్‌(25)తో పరిచయం ఏర్పడింది. చోరీకి ఎంచుకున్న బైక్‌కు ఒక్కో కీ తయారీకి రూ.1000 చెల్లించేవాడు. సులువుగా వాహనాలను కాజేసి, తక్కువ ధరకు ఎల్బీనగర్‌కు చెందిన బానాల అజయ్‌, కొప్పు శివ, డి.శివకుమార్‌, ఎన్‌.సంతోష్‌లకు విక్రయించేవాడు. బుధవారం వనస్థలిపురంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు విచారించడంతో అసలు విషయం వెల్లడైంది. 13 వాహనాలు, కారు, కీ మేకింగ్‌ మిషన్‌ను స్వాధీనం చేసుకుని.. సొహైల్‌, బైక్‌లు కొనుగోలు చేసిన నలుగురిని అరెస్టు చేశారు. రాకేష్‌ ఓ కారు కొని అందులో వచ్చి దర్జాగా బైక్‌లను ఎత్తుకెళతాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని