logo

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

Published : 08 Feb 2023 02:40 IST

శంషాబాద్‌, శంకర్‌పల్లి మున్సిపాలిటీ: వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. శంషాబాద్‌ పరిధిలో చోటుచేసుకున్న రెండు ఘటనల వివరాలను ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. కవ్వగూడకు చెందిన మంగళారం జంగయ్య, ఇస్తారమ్మ(40) దంపతులు, వ్యవసాయం చేసుకుంటూ తమ నలుగురు పిల్లలను చదివిస్తున్నారు. మొయినాబాద్‌లో నివాసం ఉంటున్న ఇస్తారమ్మ తల్లి ఆనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో తల్లిని చూడడానికి భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వచ్చింది. తిరుగు ప్రయాణంలో సుల్తాన్‌పల్లి గేట్‌ వద్ద.. కాచారం నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ఆటో దంపతుల బైక్‌ను ఢీకొట్టింది. దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలికి 20 ఏళ్ల లోపు నలుగురు పిల్లలు ఉన్నారు.

మరో ఘటనలో.. హైదరాబాద్‌- బెంగళూర్‌ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి(45-50) తొండుపల్లి నుంచి గండిగూడ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం అతణ్ని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు తెలుపు రంగు షర్టు, బూడిద రంగు ప్యాంటు ధరించాడు.మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చికిత్స పొందుతూ.. శంకర్‌పల్లి మండలంలోని పర్వేద గ్రామానికి చెందిన మనీల(48) సోమవారం తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై శంకర్‌పల్లికి వస్తోంది. పట్టణ శివారులో రోడ్డుపై ఉన్న గుంతను అంచనా వేయలేక అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వెనుక కూర్చున్న మనీల కింద పడిపోయింది. తలకి తీవ్రమైన గాయం కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు శంకర్‌పల్లి పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని