logo

గొల్ల చెరువు.. ఆహ్లాదం కరవు!

గ్రామీణ ప్రాంతాలు, ఓ మాదిరి పట్టణాల్లోని ఉద్యోగులు, గృహిణులు, పిల్లలు, యువత, వృద్ధులు ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు, సెలవు రోజుల్లో మనోల్లాసం పొందడానికి పెద్దగా పార్కులు లాంటివి ఉండవు.

Published : 31 May 2023 02:43 IST

రూ.4కోట్ల మినీ ట్యాంక్‌బండ్‌ పనులు వృథా
న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ

నడకదారిలో ముళ్లకంప ఇలా..

గ్రామీణ ప్రాంతాలు, ఓ మాదిరి పట్టణాల్లోని ఉద్యోగులు, గృహిణులు, పిల్లలు, యువత, వృద్ధులు ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు, సెలవు రోజుల్లో మనోల్లాసం పొందడానికి పెద్దగా పార్కులు లాంటివి ఉండవు. అక్కడక్కడా చెరువులుంటాయి. వీటిని పర్యాటకంగా తీర్చిదిద్దడం అరుదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణాల్లోని చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. దీనికోసం రూ.కోట్లు కేటాయించింది. లక్ష్యం బాగున్నా నిర్వహణ కొరవడి ప్రయోజనం లేకుండా పోతోంది. ఇందుకు తాండూరులోని మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదాల్చిన ‘గొల్లచెరువు’ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

ఆరంభంలో ఆర్భాటం: తాండూరు నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం గొల్లచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు నాలుగేళ్ల క్రితమే ఖరారు చేసింది. రూ.4కోట్లు మంజూరు చేసి నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో పనులు పూర్తి చేయించింది. రెండు కిలోమీటర్లకుపైగా మట్టి రహదారి నిర్మింపజేసింది. ఒకవైపు పాదచారుల నడక మార్గాన్ని అందుబాట్లోకి తెచ్చింది. మహిళలు బతుకమ్మ ఆడేందుకు బతుకమ్మ ఘాట్‌ నిర్మించారు. రహదారికి రెండు వైపులా రెయిలింగ్‌ గొట్టాలను అమర్చి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతో పట్టణంతోపాటు పరిసర గ్రామాల ప్రజల సందర్శనతో మినీ ట్యాంక్‌బండ్‌కు తాకిడి పెరిగింది. వందల సంఖ్యలో ప్రజలు ఉదయం, సాయంత్రం నడక, క్రీడలకు, వ్యాయామం చేసేందుకు సద్వినియోగం చేశారు. 

ప్రాభవం కోల్పోయే దిశగా పయనం

మినీ ట్యాంక్‌బండ్‌ రెండేళ్ల క్రితం వరకు సందర్శకులతో సందడిగా ఉండేది. క్రమంగా మున్సిపల్‌ యంత్రాంగం నిర్వహణను పట్టించుకోకపోవడంతో పాదచారుల నడకదారిలో గడ్డి, పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు ఏర్పడ్డాయి. ట్యాంక్‌బండ్‌ కుడి వైపు నుంచి మధ్యలో అమ్మవారి ఆలయం వరకు విద్యుత్‌ స్తంభాలు అమర్చి వీధి దీపాలు ఏర్పాటు చేశారు. మిగిలిన దారిలో వీధి దీపాల ఏర్పాటు విస్మరించడంతో రాత్రివేళ చీకటితో అంధకారం నెలకొంది. మట్టి రహదారి గుంతలుపడి వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. చెరువులో నీటిని పూర్తిగా కప్పేసి గుర్రపుడెక్క దర్శనమిస్తోంది. కొనల వద్ద స్థానికులు చెత్త, చెదారం పారవేస్తుంటంతో అపరిశుభ్రత నెలకొని దుర్గంధం వస్తోంది.

కూర్చునేందుకు వీలుకాని కుర్చీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని