logo

వణికిస్తున్న చౌరస్తాలు.. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

ట్రాఫిక్‌ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం పల్లెల్లో రహదారుల విస్తరణ పనులను చేపడుతోంది. అందులో భాగంగానే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని.

Published : 03 Feb 2023 05:50 IST

చర్యలు తీసుకుంటేనే మేలు
న్యూస్‌టుడే, ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట, రాచర్ల గొల్లపల్లి మధ్య బోల్తా పడిన భారీ కంటెయినర్‌

ట్రాఫిక్‌ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం పల్లెల్లో రహదారుల విస్తరణ పనులను చేపడుతోంది. అందులో భాగంగానే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కళాశాల నుంచి రాచర్ల గొల్లపల్లిలోని పెట్రోలు బంకు వరకు దాదాపు 3 కిలోమీటర్ల దూరం వరకు కామారెడ్డి- కరీంనగర్‌ ప్రధాన రహదారిని నాలుగు వరుసల రోడ్డుగా విస్తరించారు. రోడ్డు మధ్యలో డివైడర్‌పై పచ్చని చెట్లు, విద్యుత్తు దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. అయితే ఎల్లారెడ్డిపేట నుంచి రాచర్ల గొల్లపల్లి వరకు ప్రధాన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన యూ టర్న్‌ చౌరస్తాలు ప్రయాణికులు, వాహనదారులను వణికిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మూడు రోజుల క్రితం పాఠశాల దారికి యూ టర్న్‌ తీసుకునేందుకు సిద్ధమవుతున్న ఓ ప్రైవేటు బస్సును ఆర్టీసీ అద్దె బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది విద్యార్థులు, ఆర్టీసీ బస్సులో ఉన్న పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు తదితర వాహనాలు ప్రమాదాల బారిన పడటం సర్వసాధారణమైంది. ఏ మాత్రం ఏమరుపాటుగా వెళ్లినా ఆసుపత్రిపాలు కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

రాచర్ల గొల్లపల్లి శివారులో ప్రమాదకరంగా చౌరస్తా ప్రదేశం

ఏ వైపు నుంచి ఏమొస్తుందో..

కామారెడ్డి- కరీంనగర్‌ ప్రధాన రహదారి గుండా నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి రాచర్ల గొల్లపల్లి మధ్యలో నాలుగు వరుసల రహదారి చౌరస్తా ప్రాంతాల్లోనే ఈ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. డివైడర్‌పై నాటిన మొక్కలు ఏపుగా పెరగగా, ఏవైపు నుంచి ఏమొస్తుందో కనిపించని పరిస్థితి ఉంది. చౌరస్తా ప్రాంతాల్లో ఆకస్మికంగా వాహనాలను మళ్లిస్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. మరికొన్ని సందర్భాల్లో అటువైపుగా వస్తున్న వాహనాలను గమనించకుండా ఒక రోడ్డు నుంచి మరొక రోడ్డెక్కుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాలు ఆకస్మాత్తుగా రోడ్డుపైకి వస్తుండటంతో అదుపు చేయలేకపోతుండటంతో క్షణాల్లోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రహదారిపై వాహనాలను అతివేగంగా నడపడం ప్రమాదాలకు మరొక కారణం. పాదచారులు, వాహనాలు ఆకస్మికంగా రోడ్డుపైకి వస్తే అటువైపుగా వెళ్లే వాహనాల వేగాన్ని నియంత్రించడం కష్టంగా మారుతోందనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఒక వాహనాన్ని మరొకటి ఢీకొట్టడం, అదుపు తప్పి బోల్తా పడటం వంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.


ఇవీ సంఘటనలు..

గత సంవత్సరం ఏప్రిల్‌లో కామారెడ్డి నుంచి కరీంనగర్‌ వైపు ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న భారీ కంటెయినర్‌ ఎల్లారెడ్డిపేట, రాచర్ల గొల్లపల్లి నడుమ చౌరస్తా మధ్యలో బోల్తా పడింది. ఆకస్మికంగా యూటర్న్‌ తీసుకున్న ద్విచక్ర వాహనదారుడిని తప్పించబోగా కంటెయినర్‌ అదుపు తప్పింది.

రాచర్ల గొల్లపల్లి శివారులో ద్విచక్ర వాహనం యూటర్న్‌ తీసుకోగా అటుగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో రాచర్ల బొప్పాపూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా యూటర్న్‌ తీసుకునే చౌరస్తా వద్ద గూడ్స్‌ వాహనం ఢీకొని కిష్టునాయక్‌తండాకు చెందిన తండ్రీకుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం సమీపంలో పెట్రోలు బంకు వద్ద డీసీఎం వ్యాను డ్రైవర్‌ ఆకస్మికంగా యూటర్న్‌ చేయడం వల్ల అటుగా సిమెంటు లోడుతో వెళ్తున్న మరొక డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా స్థానికులు, పోలీసులు వెలికితీశారు.


వేగాన్ని నియంత్రించాలి

మినహాజ్‌ఖాన్‌, రాచర్ల బొప్పాపూర్‌

ఎల్లారెడ్డిపేట నుంచి రాచర్ల గొల్లపల్లి మధ్యలో నాలుగు వరుసల రహదారిపై బైక్‌లు, కార్లు, ఆటోలు, ఇతర భారీ వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయి. డివైడర్‌ చౌరస్తాల వద్ద కూడా వేగాన్ని తగ్గించడం లేదు. ఆకస్మికంగా ఏదైనా వాహనం రోడ్డెక్కితే అదుపు చేయడం వాహన డైవర్లకు కష్టంగా మారుతోంది. దీంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చౌరస్తాల వద్ద చోటుచేసుకుంటున్నాయి. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.


నివారణకు చర్యలు

మొగిలి, సీఐ, ఎల్లారెడ్డిపేట

డివైడర్‌ మధ్యలో యూ టర్న్‌ తీసుకునే ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎదుటి వాహనాలను గమనించకుండా వాహనాలను ఆకస్మికంగా ఇంకో రోడ్డుకు తిప్పడం, యూటర్న్‌ తీసుకునేందుకు వాహనాల వేగాన్ని ఒక్కసారిగా తగ్గించడం తదితర కారణాల వల్ల రహదారి ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రేడియం స్టిక్కర్లు అతికించి స్టాపర్లను ఏర్పాటు చేస్తాం. నిత్యం వాహన తనిఖీ నిర్వహిస్తున్నాం. అయినా రద్దీగా ఉండే యూటర్న్‌ ప్రాంతాల్లో కానిస్టేబుళ్లకు విధులు అప్పగిస్తాం. ఆర్‌అండ్‌బీ అధికారులతో కూడా చర్చించి చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని