logo

కాంగ్రెస్‌ పాలనలోనే సంక్షేమ పథకాలు

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి కార్నర్‌ సమావేశంలో మాట్లాడారు.

Published : 28 Apr 2024 05:17 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌ 

జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ చిత్రంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, అభ్యర్థి రాజేందర్‌రావు

కోరుట్ల, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి కార్నర్‌ సమావేశంలో మాట్లాడారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టును నిర్మించి రైతుల పొలాలకు సాగు నీరందిస్తామన్నారు. ప్రధాని మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని వ్యవసాయ వ్యయం పెంచారని మండిపడ్డారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకంను ప్రవేశపెట్టింది కాంగ్రెస్‌పార్టీ అని, కూలీల కనీస వేతనం రూ.400లకు పెంచేందుకు కృషి చేస్తుందన్నారు.  డీసీసీ కార్యదర్శి చెదలు సత్యనారాయణ, బోదాస్‌రెడ్డి, కట్ట శంకర్‌, వంగ మహేష్‌, మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు, ఎండీ అజీమ్‌, ఎండీ హఫీజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మేడిపల్లి: కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం మేడిపల్లి, బీమారం మండల కేంద్రాల్లో కరీంనగర్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌ రావుకు మద్దతుగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తాను హుస్నాబాద్‌లో, ఆది శ్రీనివాస్‌ వేములవాడలో గెలిచామని, రాజేందర్‌రావును పార్లమెంట్‌కు పంపితే మరింత బలం చేకూరుతుందన్నారు. పదేళ్లలో ఎంపీలుగా ఉన్న వినోద్‌కుమార్‌, బండి సంజయ్‌ నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజలకు తెలుసన్నారు. మోత్కురావుపేట-చందుర్తి రోడ్డు నిర్మాణం సహా కలికోట సూరమ్మ ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేసే బాధ్యత తమదేనన్నారు. రమేశ్‌ రెడ్డి,  నరేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాముడు అందరివాడు

కొడిమ్యాల: శ్రీరాముడు అందరివాడని, రాముని పేరుతో, అయోధ్య అక్షింతలతో భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఓట్లు అడగటం సిగ్గుచేటని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కొడిమ్యాల మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా శనివారం మంత్రి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కవ్వంపెల్లి సత్యనారాయణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్‌ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎంపీగా రాజేందర్‌రావును గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, తాను కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కాంగ్రెస్‌ గెలిస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందటూ మోదీ యువతను రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్‌ వస్తే అదాని, అంబానీలకు దోచిపెట్టిన సొత్తును ప్రజలకు పంచుతామని భయపడుతున్నారన్నారు. ఎంపీపీ స్వర్ణలత, పీసీసీ సభ్యులు మహిపాల్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు నారాయణగౌడ్‌, జి.జీవన్‌రెడ్డి, సింగిల్విండో ఛైర్మన్‌ రాజనర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని