logo

‘కొత్త పద్ధతిని విరమించుకోండి’

సింధనూరు ఉప విభాగం పరిధిలో నీటిపారుదల అధికారులు కొత్తగా ప్రవేశపెట్టాలని భావించిన ఉప కాలువల ‘ఆన్‌ అండ్‌ హాఫ్‌’ పద్ధతిని తక్షణం విరమించుకోవాలని, లేకుంటే విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రాంత రైతు సంఘం నాయకులు అధికారులను హెచ్చరించారు.

Published : 29 Jan 2023 04:02 IST

నీటిపారుదల అధికారులకు వినతిపత్రం అందిస్తున్న రైతుసంఘం నాయకుడు కరుటూరి వెంకణ్ణ

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు ఉప విభాగం పరిధిలో నీటిపారుదల అధికారులు కొత్తగా ప్రవేశపెట్టాలని భావించిన ఉప కాలువల ‘ఆన్‌ అండ్‌ హాఫ్‌’ పద్ధతిని తక్షణం విరమించుకోవాలని, లేకుంటే విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రాంత రైతు సంఘం నాయకులు అధికారులను హెచ్చరించారు. ఈ విషయమై రెండు రోజులుగా స్థానిక మినీ విధానసౌధ ఎదుట ధర్నా జరిపిన రైతు సంఘం నాయకులు శనివారం సాయంత్రం నీటిపారుదల అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఎడమ ప్రధాన కాలువ మైలు 47 నుంచి 69 వరకూ (సింధనూరు ఉప విభాగం) అన్ని ఉప కాలువలకు వంతుల ప్రకారం నీటిని అందించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో లవెల్లడించారు. దానిని తక్షణం ఉపసంహరించుకోవాలని రైతులు పట్టుబట్టారు. రెండో పంటకు అసలే నీరు అంతంతమాత్రంగా అందుతున్నాయి. సాగునీరు సవ్యంగా అందక కొన్ని వరిచేలు ఎండిపోతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా వంతులు వారీ నీటి విడుదల పద్ధతి.. రైతును నట్టేట ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాట రైతుల తరఫున సంఘం నాయకుడు కరుటూరి వెంకణ్ణ అధికారులకు వినతిపత్రం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని