logo

దారి మళ్లిన రూ.1.50 కోట్ల పరిహారం

జాతీయ రహదారి భూ నిర్వాసితుల పరిహారం దారి మళ్లింది. పంపిణీ కావాల్సిన మొత్తాన్ని జిల్లాకు చెందిన ఓ అధికారి తన ఖాతాలోకి జమ చేసుకున్నారు.

Published : 08 Jun 2023 04:31 IST

 తన ఖాతాలో జమ చేసుకున్న అధికారి

కర్నూలు- గుంటూరు రహదారి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారి భూ నిర్వాసితుల పరిహారం దారి మళ్లింది. పంపిణీ కావాల్సిన మొత్తాన్ని జిల్లాకు చెందిన ఓ అధికారి తన ఖాతాలోకి జమ చేసుకున్నారు. ఈ అంశం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కర్నూలు- గుంటూరు (340 సీ) జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు మండలాల్లో భూ సేకరణ చేశారు. ఇందులో ప్రభుత్వ భూమి 46.54 ఎకరాలు, ప్రైవేటు 498.77 ఎకరాలకు కలిపి మొత్తం 545.31 ఎకరాలు సేకరించారు. ఆయా భూములకు సంబంధించి రూ.203.06 కోట్ల పరిహారం మంజూరైంది. బాధితుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అందులో రూ.1.50 కోట్లు రెవెన్యూ అధికారి ఒకరు తన ఖాతాలోకి జమ చేసుకున్నారు.

73 కి.మీ పొడవునా

జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కర్నూలు నుంచి ఆత్మకూరు వరకు కర్నూలు, నంద్యాల రెండు జిల్లాల పరిధిలో ప్రభుత్వం 715 ఎకరాలు సేకరించింది. కర్నూలు-గుంటూరు రోడ్డులో కర్నూలు జిల్లాలో 170 ఎకరాలు, నంద్యాల జిల్లా పరిధిలో 545 ఎకరాలకు అవార్డు పాస్‌ చేశారు. ఇందులో కర్నూలు నుంచి ఆత్మకూరు వరకు 73 కిలోమీటర్ల పొడవునా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రహదారిని ఆనుకుని ఇరువైపులా భూసేకరణ చేపట్టారు. వాణిజ్య స్థలాలకు చదరపు గజాల ప్రకారం, వ్యవసాయ పొలాలకు ఎకరాల ప్రకారం ధర నిర్ణయించారు.

నిధులు బదలాయించాలని చెప్పినా

పరిహార నిధులు దారి మళ్లించడంలో భూసేకరణ అధికారులు కొందరు కీలకపాత్ర వహించారు. అధికారిక ఖాతాలో ఉండాల్సిన నిధులు కొద్దిరోజుల క్రితం అధికారి వ్యక్తిగత, కుటుంబ ఖాతాలోకి చేరాయి. ఇందులో డిప్యూటీ తహసీల్దారు ఒకరు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. రైతులకు చెందాల్సిన నిధులు ఒక అధికారికి చేరడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవున్నాయి. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణ చేశారు. నిధులు మాతృశాఖకు బదలాయించాలని ఆ అధికారి సూచించినట్లు సమాచారం. కానీ పరిహార మొత్తం సంబంధిత అధికారి ఖాతాలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని