logo

లెక్క తప్పితే పదవికి గండమే

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు.

Updated : 24 Apr 2024 06:40 IST

ఎన్నికల వ్యయంపై ఈసీ నిఘా

గద్వాల, కొత్తకోట, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు. ఉప సంహరణ పూర్తి కాగానే ప్రచార ప్యూహాలకు పదును పెట్టనున్నారు అభ్యర్థులు. మరో వైపు అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రోజువారీ ఖర్చుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.95 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. ఒక వేళ పరిమితి దాటితే ఎన్నికైనా సరే పదవికి గండం తప్పదు. గతంలో రూ.70 లక్షలు ఉండే దాన్ని రూ.95 లక్షలకు ఎన్నికల సంఘం పెంచింది. ప్రచార సరళి, సభలు, సమావేశాలు, వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.  

నామినేషన్ల నుంచే..  

అభ్యర్థుల ర్యాలీలు, ప్రచారాలు, సభలు సమావేశాలు, భోజనాలు, వాహనాలు ఇతర అవసరాలకు సంబంధించి అధికారులు ఎన్నికల పక్కాగా లెక్కిస్తున్నారు. ప్రతి అభ్యర్థికి రూ.95 లక్షల వరకు వెసులుబాటును కల్పించారు. పార్టీల సమక్షంలోనే స్థానిక ధరలకు అనుగుణంగా ఆమోద ముద్ర వేశారు. నామినేషన్‌ దాఖలు నుంచి ఓట్ల లెక్కింపు వరకు అభ్యర్థి వెచ్చించే ప్రతి పైసాకు లెక్క చూపాల్సిందే. నామినేషన్‌ వేయటానికి ఒక రోజు ముందు తెరిచిన బ్యాంకు ఖాతాలో అభ్యర్థుల ఎన్నికల లావాదేవీలను నమోదు చేయాల్సి ఉంటుంది.


బృందాల నిఘా: ఎన్నికల్లో డబ్బు, ఇతర ప్రలోభాలను నియంత్రించేందుకు ప్రతి శాసనసభా నియోజకవర్గానికి స్టాటిక్‌ సర్వైలెన్స్‌, వీడియో సర్వైలెన్స్‌, వీడియో వీవింగ్‌, ఎంసీసీ బృందాలు అధ్వర్యంలో నిఘా పెట్టారు. అభ్యర్థుల వెంట షాడో బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సభలు, సమావేశాలు, అవసరమైన టెంట్లు, కుర్చీలు, వాహనాలు, ఇతర సామగ్రి, ప్రచార కార్యక్రమాలు ఇలా ప్రతి అంశాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చులను వ్యయ బృందాలు మూడుసార్లు తనిఖీలు చేస్తుంటాయి. వీడియో చిత్రీకరణ అభ్యర్థులు నివేదించిన వాటిలో వ్వత్యాసం ఉంటే నోటీసులు జారీ చేస్తారు.


వ్యయ పరిశీలకుల పర్యటన

ఎన్నికల్లో ధన ప్రవాహం కట్టడికి ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్యాడర్‌కు చెందిన వారిని ఐఆర్‌ఎస్‌, ఐడీఏఎస్‌, సర్విస్‌ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఈసీ నియమిస్తుంది. వీరు సదరు లోక్‌సభ స్థానం పరిధిలో మూడు సార్లు పర్యటిస్తారు. నామపత్రాల దాఖలు మొదలుకుని చివరి వరకు, ఉపసంహరణ అనంతరం నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఆయా నియోజకవర్గాల పరిధిలోనే మకాం వేస్తారు. ఓటర్లను ఎక్కడెక్కడ  ఎలా ప్రభావితం చేస్తున్నారు.. ఖర్చు ఎలా పెడుతున్నారని అంచనాకు వస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన 27 రోజుల తరువాత మరోసారి ఇలా మూడు విడతల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. అభ్యర్థుల వ్యయాలను నిశితంగా పరిశీలిస్తారు. దస్త్రాల్లో వ్యత్యాసం నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లు గుర్తిస్తే వివరాలను ఎన్నికల సంఘానికి పంపిస్తారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 18న వ్యయ పరిశీలకులను ఈసీ నియమించింది. మహబూబ్‌నగర్‌కు వరుణ్‌రంగ స్వామి, నాగర్‌కర్నూల్‌కు సౌరభ్‌ను కేటాయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని