logo

తొలిమెట్టు విజయవంతానికి ‘టాస్క్‌ఫోర్స్‌’

మలి విడత తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Published : 29 Nov 2022 06:20 IST

నియమించనున్న జిల్లా విద్యాశాఖ

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: మలి విడత తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమం అమలవుతున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రత్యేక పర్యవేక్షణకు అకడమిక్‌ మానిటరింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీల ఏర్పాటుకు విద్యాశాఖ ఆదేశించింది. ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమం విజయవంతం చేయడమే లక్ష్యంగా ఈ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పని చేస్తుంది. ఈ నేపథ్యంలో కథనం.

డీఈవో ఆధ్వర్యంలో..

జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో అకాడమిక్‌ మానిటరింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో సభ్యులుగా జిల్లా నాణ్యతా ప్రమాణాల సమన్వయకర్త, అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి, మండల విద్యాధికారి, మండల స్థాయి రిసోర్స్‌ పర్సన్లు, క్లస్టర్‌ స్థాయి రిసోర్స్‌ పర్సన్లు, విద్యారంగంలో పని చేస్తున్న ఓ ఎన్జీవో ప్రతినిధితో కలిపి మొత్తం ఏడుగురు సభ్యులు కమిటీలో ఉంటారు.

ప్రణాళికలు అమలయ్యేలా..

జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే టాస్స్‌ఫోర్స్‌ కమిటీపై మార్గదర్శకాలు నిర్దేశించారు. జిల్లా ప్రణాళికకు అనుగుణంగా నెల వారీగా ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తారు. పాఠశాలల పనితీరు, విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తారు. ఉపాధ్యాయులు బోధనా సామర్థ్యాలు పెంచుకునేందుకు టీఎల్‌ఎం తయారీ, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధనా పద్ధతులను పరిశీలిస్తారు. వంద శాతం ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్యాలను సాధించేలా ప్రధాన ఉద్దేశం. ఎంఆర్‌సీ, సీఆర్పీల      మధ్య సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు తగిన సూచనలు అందించడం, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి వాటిని అధిగమించేలా చర్యలు తీసుకుంటారు. పోషకులు, పాఠశాల కమిటీ సభ్యులతో మాట్లాడి ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం అమలు గురించి వివరిస్తారు. అమలు తీరుపై పర్యవేక్షణ చేస్తారు.

ప్రత్యేక నివేదికలు

కమిటీ సభ్యులు తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం ఎలా అమలవుతుంది? ఉపాధ్యాయుల బోధనా తీరు, విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారో పరిశీలిస్తారు. వీటిపై నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తారు. పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమం అమలుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని జిల్లా విద్యాధికారి రాజేశ్‌ తెలిపారు.


జిల్లాలో విద్యార్థులు
విభాగం పాఠశాలల విద్యార్థులు
ప్రాథమిక 864 62,129
ప్రాథమికోన్నత 199 14,189

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని