logo

నజరానాతో ప్రోత్సాహం సేవలు బలోపేతం

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అవసరం మేరకు సౌకర్యాలు కల్పించడంతో పాటు.. దవాఖానాలకు పోటీలు నిర్వహిస్తోంది. వైద్య సేవల మెరుగుకు కృషి చేస్తోంది.

Published : 08 Jun 2023 02:12 IST

వివిధ అవార్డులకు ఎంపికైన జిల్లా ఆసుపత్రులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

కాయకల్ప అవార్డుకు ఎంపికైన పటాన్‌చెరు ప్రాంతీయ ఆసుపత్రి

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అవసరం మేరకు సౌకర్యాలు కల్పించడంతో పాటు.. దవాఖానాలకు పోటీలు నిర్వహిస్తోంది. వైద్య సేవల మెరుగుకు కృషి చేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్‌ పరిశీలన బృందం కేటాయించే మార్కుల ఆధారంగా జాతీయ స్థాయిలో అవార్డులు ప్రకటిస్తూ ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని పలు ఆసుపత్రులు ‘కాయకల్ప’ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో ఒనగూరే ప్రయోజనాలపై కథనం.

మెరుగవుతున్న సౌకర్యాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంతో పోల్చితే సౌకర్యాలు మెరుగవుతున్నాయి. వైద్యులు, సిబ్బంది నియామకం, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. పీహెచ్‌సీల్లో జ్వరం, దగ్గులాంటికి చికిత్సతో పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా, ప్రాంతీయ, సామాజిక దవాఖానాల్లో సాధారణ ప్రసవాలు, శస్త్ర చికిత్సలు చేస్తుంటారు. మిగిలిన పలు రకాల దవాఖానాల్లో సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పురస్కారాలకు ఎంపికైన ఆసుపత్రులకు ఇచ్చే నజరానా నుంచి.. దవాఖానాల బలోపేతానికి 75 శాతం, 25 శాతం వైద్యులకు, సిబ్బందికి ఇన్సెంటివ్‌గా పంపిణీ చేస్తారు.

ఇటీవల గుర్తింపు పొందినవి

* జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో పలురకాల ఆసుపత్రులు కాయకల్ప అవార్డుల్లో సత్తాచాటాయి. జహీరాబాద్‌ ప్రాంతీయ దవాఖానా 71.43 శాతం మార్కులు, పటాన్‌చెరు ప్రాంతీయ ఆసుపత్రి 70.86 శాతం మార్కుల(కమాండేషన్‌ కింద)తో అర్హత సాధించాయి. వీటికి కేంద్రం నుంచి ఏడాదికి రూ.2లక్షల చొప్పున నజరానా అందనుంది.

* మునిపల్లి మండలం దిగ్వాల్‌ పీహెచ్‌సీ జిల్లా స్థాయిలో కాయకల్ప అవార్డుకు ఎంపికకాగా.. కేంద్రం నుంచి రూ.85 వేలు అందనున్నాయి. దీంతోపాటు గుమ్మడిదల, కోహీర్‌ మండలం బిలాల్‌పూర్‌, పటాన్‌చెరు మండలం భానూరు, హత్నూర, కంది, మనూరు పీహెచ్‌సీలు ఎంపికయ్యాయి.

* పట్టణ ఆరోగ్య కేంద్రాల విభాగంలో సంగారెడ్డి మార్క్స్‌నగర్‌ కేంద్రం ఎంపిక కాగా.. రూ.2లక్షల నిధులు సమకూరనున్నాయి. మరో విభాగంలో ఇక్కడి ఇందిరానగర్‌ యూపీహెచ్‌సీ కూడా ఎంపికైంది. కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ పీహెచ్‌సీ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడంతో రూ.లక్ష ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.

* రామచంద్రాపురంలోని బండ్లగూడ, లింగమయ్య, ఎల్‌ఐజీ, ఎస్సీ కాలనీలల్లోని బస్తీ దవాఖానాలు, సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం కమాండేషన్‌ కింద అర్హత సాధించాయి.

* ఇటీవల జిల్లా కేంద్ర ఆసుపత్రి లక్ష్య కార్యక్రమానికి ఎంపికైంది.

* సంగారెడ్డి ఎంసీహెచ్‌(మాతా శిశు ఆరోగ్య కేంద్రం) గుర్తింపు దక్కించుకుంది.


ఒకటి కంటే ఎక్కువసార్లు

కాయకల్ప కార్యక్రమం కింద జిల్లా ఆసుపత్రికి జిల్లా స్థాయి ఉత్తమ వైద్యాలయం అవార్డు దక్కింది. ఈ దవాఖానా గతంలోనూ రెండుసార్లు ఎంపిక కావడం గమనార్హం. ‘కాయకల్ప’కు జహీరాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రి మూడు సార్లు ఎంపికైంది.


అందరి కృషితోనే సాధ్యమైంది
- రవి, జిల్లా వైద్య సేవల నాణ్యతా ప్రమాణాల విభాగం అధికారి.

జిల్లాలో అధికారులు, వైద్యులు, సిబ్బంది కృషి వల్లే ప్రభుత్వ ఆసుపత్రులకు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు వరిస్తున్నాయి. గుర్తింపు దక్కడంతో పాటు కేంద్రం నుంచి ఏటా నజరానా అందుతోంది. దీంతో వైద్య సేవలు బలోపేతమవుతున్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని