logo

డార్మిటరీలో స్నేహం.. చోరీల వ్యూహం

ఎంజీబీఎస్‌ వద్ద ఉన్న డార్మిటరీలో పరిచయమై సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 28 Apr 2024 03:55 IST

14 చరవాణులు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం

వివరాలను వెల్లడిస్తున్న సుల్తాన్‌బజార్‌ ఏసీపీ శంకర్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఎంజీబీఎస్‌ వద్ద ఉన్న డార్మిటరీలో పరిచయమై సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 14 చరవాణులు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఏసీపీ శంకర్‌ తెలిపిన ప్రకారం.. వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన గడల రాము ఉస్మాన్‌గంజ్‌లోని ఓ డెకరేషన్‌ వస్తువుల గోడౌన్‌ నిర్వహిస్తున్నాడు. ఈనెల 25న ఉస్మాన్‌గంజ్‌ నుంచి నారాయణగూడ వస్తూ రూ.30 వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ పోగొట్టుకొని నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు శనివారం మధ్యాహ్నం రాంకోఠి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై కనిపించగా అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద 13 చరవాణులు ఉన్నాయి. నిందితులు మహబూబ్‌నగర్‌లోని ఎల్కగుడ గ్రామానికి చెందిన చాకలి బాలరాజు, మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం, అబ్లాపూర్‌కు చెందిన కూరంరాజుగా గుర్తించారు. ఇద్దరూ కూలీలు. బాలరాజు చరవాణులు కొట్టేయడంలో సిద్ధహస్తుడు, ఇతడిపై ఇప్పటికే 18 కేసులు ఉన్నాయి. కూరంరాజు తాళం వేసిన ద్విచక్రవాహనాలను అపహరించడంలో ఆరితేరినవాడు. ఇతడిపై రెండు కేసులు ఉన్నాయి. కూరంరాజు ఎంజీబీఎస్‌లోని ఓ డార్మెటరీలో ఉంటున్నాడు. కొన్నాళ్ల కిత్రం చాకలి బాలరాజు సైతం అక్కడ బస చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి సెల్‌ఫోన్‌లు, ద్విచక్రవాహనాలు చోరీ చేసి, వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. రాంకోఠిలో తాము కొట్టేసిన వాహనం అమ్మేందుకు వచ్చి పోలీసులకు చిక్కారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 48 గంటల్లో కేసును పరిష్కరించిన నారాయణగూడ డీఐ నాగార్జున, డీఎస్సై వెంకటేశ్‌, సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.a

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని