logo

విమర్శల జోరు.. కేరింతల హోరు

మెదక్‌ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్‌ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్‌-జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల భాజపా విశాల్‌ జనసభ కమలదళంలో ఆద్యంతం ఉత్తేజం నింపింది. కాంగ్రెస్‌ పార్టీ విధానాలను ప్రధాని నరేంద్రమోదీ దుయ్యబట్టారు.

Published : 01 May 2024 02:21 IST

కమల దళంలో ఉత్తేజం నింపిన ప్రధాని మోదీ

వేదికపై నుంచి ప్రజలకు అభివాదô చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఈనాడు,కామారెడ్డి:న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌,జోగిపేట, జోగిపేట టౌన్‌, అల్లాదుర్గం: మెదక్‌ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్‌ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్‌-జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల భాజపా విశాల్‌ జనసభ కమలదళంలో ఆద్యంతం ఉత్తేజం నింపింది. కాంగ్రెస్‌ పార్టీ విధానాలను ప్రధాని నరేంద్రమోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌, భారాస తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని వివరించారు. రెండు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి భారీగా హాజరైన జనం ప్రధాని ప్రసంగిస్తున్నంత సేపు ‘మోదీ మోదీ’ అంటూ కేరింతలతో హోరెత్తించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌, భారాసలు కేంద్ర ప్రభుత్వంతో పాటు భాజపాపై చేస్తున్న విమర్శలను తిప్పిగొట్టారు. జహీరాబాద్‌ -మెదక్‌ నియోజకవర్గాల అభివృద్ధికి భరోసా ఇచ్చారు.

తరలివచ్చిన జనం : సభకు కామారెడ్డి, జుక్కల్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు అందోలు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, మెదక్‌ నియోజకవర్గాల  నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. యువతతో పాటు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.  కార్యకర్తలను ఎన్నికలకు కార్యోన్ముఖులు చేసేలా ప్రధాని ప్రసంగం కొనసాగింది.


సభపదనిసలు

 

  • గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు.
  • 4.44 నిమిషాలకు వేదికపైకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు
  • జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ ప్రధాన మంత్రికి  జ్ఞాపికను అందించి సన్మానించారు 
  • ప్రధాన మంత్రి ప్రసంగాన్ని ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ తెలుగులో అనువదించారు
  • ప్రధాని తన  ప్రసంగంలో ప్రజలు వేసిన ఓటు ద్వారా ఆయోధ్యలో రామమందిరం కట్టామని పేర్కొనగా.. ప్రజలు ఒక్కసారి లేచి ‘మోదీ మోదీ’ అంటూ నినదించారు.

    రేవంత్‌తో హరీశ్‌ కుమ్మక్కు: రఘునందన్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భారాస నేత హరీశ్‌రావు కుమ్మక్కయ్యారు. మాజీ సీఎం కేసీఆర్‌కు అల్లుడి భయం పట్టుకుంది. కేసీఆర్‌కు ఝలక్‌ ఇచ్చేందుకే మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు హరీశ్‌ పంపించారు. మార్చి 19న ఎమ్మెల్సీ కవితను పరామర్శించేందుకు దిల్లీ వెళ్లి తిరిగి వచ్చే సమయంలో రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారు. ఈ సమయంలో దాదాపు రెండు గంటల పాటు మంతనాలు సాగించినట్లు సమాచారం ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం అవకతవకల్లో మొదటి ముద్దాయి హరీశ్‌రావే. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఆయన పేరును చేర్చడం లేదు. జహీరాబాద్‌, మెదక్‌ స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగురవేయడం ఖాయô.


జహీరాబాద్‌ అభివృద్ధిలో అగ్రగామి: బీబీపాటిల్‌

గత పదేళ్లకాలంలో జహీరాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశా.  కొన్ని పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవి పూర్తికావాలంటే నన్ను గెలిపించాలి. కేంద్రంలో భాజపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయô. భాజపాకు చెందిన వ్యక్తి ఎంపీగా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు సాధించడం తేలికవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పూర్తవుతాయి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని