logo

సవాళ్లున్నా..ప్రకాశిద్దాం

జిల్లాలో నవరత్నాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ ఏఎస్‌.దినేష్‌ కుమార్‌ చెప్పారు. 74వ గణతంత్ర దిన వేడుకలను ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

Published : 27 Jan 2023 02:13 IST

ప్రతిష్ఠాత్మకంగా పథకాల అమలు
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌

జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

జిల్లాలో నవరత్నాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ ఏఎస్‌.దినేష్‌ కుమార్‌ చెప్పారు. 74వ గణతంత్ర దిన వేడుకలను ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత తదితరులు హాజరయ్యారు. తొలుత కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు

దేశభక్తి గేయానికి అభినయిస్తున్న విద్యార్థుల బృందం

జాతీయ జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, ఎస్పీ మలికా గార్గ్‌


* వనరులతో పాటు సవాళ్లూ అనేకం...: జిల్లాలో సహజ వనరులు పుష్కలం. అదే సమయంలో సవాళ్లూ అనేకం. పశ్చిమం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. తాగు, సాగు నీటి లభ్యత తక్కువ. వర్షాధార పంటల సాగుతో రైతులకు సరైన ఆదాయం లభించడం లేదు. వ్యవసాయ పద్ధతులు, ఎరువులు, పురుగు మందుల వినియోగంపై అవగాహనా లోపం ఉంది. ఈ సవాళ్లను అధిగమించడానికి గాను 4.47 లక్షల ఎకరాలకు సాగు, 15.25 లక్షల మందికి తాగు నీరు అందించేందుకు రూ.8052 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. గుండ్లకమ్మ జలాశయం నుంచి 80 వేల ఎకరాలకు సాగు, 2.56 లక్షల మందికి తాగు నీరు అందిస్తున్నాం. వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా 5,740 మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. 1.72 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 9 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం. 616 ఆర్‌బీకేల ద్వారా రైతులకు సేవలందిస్తున్నాం. పీఎం కిసాన్‌ పథకం అమలులో రాష్ట్రంలోనే రెండు స్థానంలో నిలిచాం.
* 152 ఫిష్‌ రిటైల్‌ అవుట్‌లెట్ల ఏర్పాటు...: 2022-23 ఖరీఫ్‌కు సంబంధించి 549 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరించాం. ఫిష్‌ ఆంధ్ర పేరుతో సచివాలయాల పరిధిలో ఇప్పటి వరకు 152 రిటైల్‌ అవుట్‌లెట్లు ఏర్పాటు చేశాం. కొత్తపట్నం వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. జగనన్న పాల వెల్లువలో రోజుకు సగటున 20 వేల లీటర్ల పాల సేకరణతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉన్నాం. ఉద్యాన పంటల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. 7,273 హెక్టార్లలో ఇవి సాగవుతున్నాయి. జగనన్న భూరక్ష పథకం కింద 56 గ్రామాల్లో రీసర్వే పూర్తిచేసి, 119 గ్రామాల్లో ప్రాథమిక సర్వే చేశాం. 2023 డిసెంబరుకు అంతటా పూర్తిచేస్తాం.

పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌

* మానవ వనరులే బలమైన ఆస్తి...: పునర్విభజన తర్వాత జిల్లా జనాభా 23 లక్షలుగా ఉంది. ఇందులో 11 లక్షల మంది శ్రామికులున్నారు. ఈ మానవ వనరులే మనకు బలమైన ఆస్తి. అక్షరాస్యులు 62.45 శాతంగా ఉన్నారు. కష్టపడి పనిచేసే కార్మికులే ఎక్కువ మంది. అయితే ఎస్సీ, ఎస్టీ నిరక్షరాస్యత, 6.59 లక్షలు బీపీఎల్‌ కుటుంబాలు, బాలికల వివాహాలు ఎక్కువగా చోటుచేసుకోవడం బాధాకరం. స్టంట్‌, తక్కువ బరువున్న పిల్లలు 13 వేల మంది ఉండటం కలవర పెడుతోంది. వీటిని అధిగమించేందుకు చర్యలు చేపట్టాం. బాలింతలు, గర్భిణులు, ఆరేళ్లలోపు పిల్లలకు పోషకాహారం అందించడం, బడుల్లో మౌలిక వసతులు పెంచడం వంటి చర్యలు చేపడుతున్నాం. గతేడాది పదో తరగతి పరీక్షల్లో 78.30 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో 1.25 లక్షల మందికి స్థలాలిచ్చాం. ఉగాది నాటికి 9736 ఇళ్లలో గృహ ప్రవేశం లక్ష్యంగా పనులు చేపడుతున్నాం.

ప్రకాశం మనవడు గోపాల కృష్ణ, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను
సన్మానిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి

* పారిశుద్ధ్యం, తాగునీటికి ప్రాధాన్యం...: గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.49 కోట్లతో పెద్దదోర్నాలలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, మార్కాపురంలో రూ.475 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం, వైద్య శాఖలో ఖాళీల భర్తీ వంటి చర్యలు చేపడుతున్నాం. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా నీటి సమస్యను తీర్చడానికి 99 వేల ఇళ్లకు నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం. ఇందులో ఇప్పటికే 61 వేలిచ్చాం. అమృత్‌ పథకం- 2లో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థలో రూ.339 కోట్లతో, దర్శిలో రూ.121 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయనున్నాం...’ అని కలెక్టర్‌ తన గణతంత్ర వేడుకల ప్రసంగంలో వివరించారు.


ఆకట్టుకున్న శకటాలు.. అలరించిన నృత్యాలు

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకల సందర్భంగా ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలుత పోలీసు బలగాల కవాతు కనులవిందుగా సాగింది. పోలీసు బ్యాండ్‌కు అనుగుణంగా సిబ్బంది కదం తొక్కారు. రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీహరిరెడ్డి పెరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అయిదు కంటిజెంట్ల సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. మహిళా కంటింజెంట్‌కు హనుమంతునిపాడు ఎస్సై కృష్ణపావని ప్లటూన్‌ కమాండర్‌గా వ్యవహరించారు. ఎన్‌సీసీ విద్యార్థులు ప్రదర్శించిన సాహసాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు తమ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను తెలుపుతూ ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపీ, పశు సంవర్ధక, గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, సర్వే, సెటిల్‌మెంట్‌, విద్యాశాఖ/సర్వశిక్షా అభియాన్‌; డ్వామా, డీఆర్‌డీఏ, పౌరసరఫరాల శాఖలు తమ కార్యక్రమాలను వివరిస్తూ శకటాలను ప్రదర్శించాయి. కవాతు మైదానంలో వేడుకల అనంతరం వీటిని ఒంగోలు నరగంలోని ప్రధాన వీధుల్లోనూ ప్రదర్శించారు. పలు పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని చాటిచెప్పేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


నాగలి, వరి, జొన్న కంకులు చేతబట్టి ఎడ్లబండితో రైతన్నల
వేషధారణలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని