logo

అనాథాశ్రమం వద్దు.. ఆస్తి మాకే ఇవ్వు

ఆ వృద్ధుడిది ఉన్నతాశయం. భార్య మరణం తర్వాత ఒంటరిగా ఉంటున్నారు. తన ఆస్తి పది మంది మంచికి ఉపయోగించాలనుకున్నారు. ఓ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు.

Updated : 02 Jun 2023 06:23 IST

‌వృద్ధుడిని అపహరించిన బంధువులు

గంటల వ్యవధిలో కేసు ఛేదించిన పోలీసులు

దాడిలో గాయపడిన రామిరెడ్డి

దర్శి(ముండ్లమూరు), న్యూస్‌టుడే: ఆ వృద్ధుడిది ఉన్నతాశయం. భార్య మరణం తర్వాత ఒంటరిగా ఉంటున్నారు. తన ఆస్తి పది మంది మంచికి ఉపయోగించాలనుకున్నారు. ఓ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు. అప్పటికే అతని ఆస్తిపై కన్నేసి ఉన్న బంధువులకు ఇది నచ్చలేదు. ఎలాగైనా కొట్టేయాలని పన్నాగం పన్నారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తిని రాత్రికి రాత్రే అపహరించారు. ఆపై దాడి చేసి గాయపరిచారు. ఇందుకు సంబంధించిన కేసును పోలీసులు కొద్ది గంటల వ్యవధిలోనే ఛేదించారు. దర్శి పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలికాగార్గ్‌ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పెద్దిరెడ్డి రామిరెడ్డిది నంద్యాల జిల్లా సంజాముల మండలం ముక్కమల్ల గ్రామం. ప్రస్తుతం బేస్తవారపేట మండలం పూసలపాడులో నివాసం ఉంటున్నారు. రామిరెడ్డి భార్య నాలుగు నెలల క్రితం మృతిచెందారు. వీరికి పిల్లలు లేరు. దీంతో ఒంటరిగా ఉంటున్నారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం ఆర్‌.పాపంపల్లి గ్రామానికి చెందిన పసువుల రాము, కళావతిలు.. రామిరెడ్డి భార్యకు సమీప బంధువులు. భార్య మృతిచెందడం.. పిల్లలు లేకపోవడంతో తన పేరిట ఉన్న 2.70 ఎకరాల పొలం, బ్యాంకులో దాచిన రూ. 25 లక్షలతో అనాథాశ్రమం నిర్మించాలని రామిరెడ్డి భావించారు. రాము, కళావతి ఈ నిర్ణయంతో విభేదించారు. పొలం, నగదు తమకివ్వాలని వృద్ధుడిపై ఒత్తిడి చేశారు. అతను నిరాకరించడంతో అపహరించేందుకు ప్రణాళిక రచించారు.

స్నేహితుల సాయంతో పన్నాగం...: వృద్ధుడు రామిరెడ్డిని అపహరించి ఆపై ఆస్తి, నగదు పొందాలని రాము, కళావతి నిర్ణయించుకున్నారు. ఇందుకు స్నేహితులైన నంద్యాల జిల్లా ఫ్యాబిలి మండలం చండ్రపల్లికి చెందిన బోయ నాగార్జున, అదే జిల్లా పాండురంగాపురానికి చెందిన కారు డ్రైవర్‌ కేదార్‌నాథ్‌, రమేష్‌ల సహకారం తీసుకున్నారు. రామిరెడ్డి పింఛను తీసుకునేందుకు బేస్తవారపేట మండలం పూసలపాడు గ్రామానికి వచ్చారు. ఈ విషయం ముందే తెలిసిన వారు మే 31న కారులో వచ్చి రామిరెడ్డిని అపహరించారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు 112కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు.

‌*గదిలో బంధించి.. హింసించి...: వెంటనే రంగంలోకి దిగిన బేస్తవారపేట ఎస్సై  కె.మాధవరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మార్కాపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, కంభం సీఐ ఎం.రాజేష్‌ నేతృత్వంలో కంభం, అర్థవీడు ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, ఎంవీ.నాయక్‌ అప్రమత్తం అయ్యారు. పందిళ్లపల్లి టోల్‌ప్లాజా, దిగువమిట్టా చెక్‌పోస్టు వద్ద సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. కారు నంబరును గుర్తించి యజమాని నుంచి వివరాలు తీసుకున్నారు. లోకేషన్‌ ఆధారంగా అర్థవీడు ఎస్సై ఎంవీ.నాయక్‌ తన సిబ్బందితో తెలంగాణ రాష్ట్రం వెళ్లి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా నంద్యాలలోని సంజీవనగర్‌లో గురురాఘవేంద్ర బ్యాంకు సమీపంలో వృద్ధుడిని వదిలినట్టు చెప్పారు. కంభం సీఐ బేస్తవారపేట ఎస్సైలు అక్కడికి వెళ్లి నంద్యాల పోలీసుల సాయంతో రామిరెడ్డి ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. ఒక గదిలో గాయాలతో బంధీగా ఉన్న అతన్ని కాపాడి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సంఘటన చోటుచేసుకున్న పన్నెండు గంటల్లోపే కేసు ఛేదించినందుకు డీఎస్పీ, సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో శిక్షణ ఐసీఎస్‌ అధికారిణి అంకితా సురానా పాల్గొన్నారు.


వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మల్లికాగార్గ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని