రోగుల ప్రాణాలతో చెలగాటం

ఉద్దానం తర్వాత రాష్ట్రంలో ఎక్కువ మంది మూత్రపిండ వ్యాధిగ్రస్థులున్న ప్రాంతం కనిగిరి. దాదాపు వెయ్యి మంది వరకు బాధపడుతున్నారు. వీరిలో అత్యంత ప్రమాదర పరిస్థితుల్లో ఉన్న వారూ ఎందరో ఉన్నారు.

Updated : 04 Jun 2023 05:58 IST

జనరేటర్‌ ఆధారంగా డయాలసిస్‌ సేవలు
ఏసీలు పని చేయక రోగుల అవస్థలు
‌విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వని అధికారులు

కూర్చునేందుకు కుర్చీలూ లేక అట్టలపై సేదతీరుతున్న  డయాలసిస్‌ రోగులు

కనిగిరి, న్యూస్‌టుడే: ఉద్దానం తర్వాత రాష్ట్రంలో ఎక్కువ మంది మూత్రపిండ వ్యాధిగ్రస్థులున్న ప్రాంతం కనిగిరి. దాదాపు వెయ్యి మంది వరకు బాధపడుతున్నారు. వీరిలో అత్యంత ప్రమాదర పరిస్థితుల్లో ఉన్న వారూ ఎందరో ఉన్నారు. వీరికి వారంలో రెండు, మూడుసార్లు డయాలసిస్‌ అవసరం. ఇటువంటి వారంతా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో గత తెదేపా ప్రభుత్వం స్పందించింది. కనిగిరి సామాజిక ఆసుపత్రిలోనే డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 16 పడకలపై రోజుకు 50 మందికి పైగా రోగులకు డయాలసిస్‌ సేవలు ఇక్కడ అందిస్తున్నారు. గత నెలలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తింది. డయాలసిస్‌ కేంద్రంలో ఏసీలు, పరికరాలు కాలిపోయాయి. వారం రోజులపాటు సేవలు అందుబాటులో లేక రోగులు విలవిల్లాడారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ స్పందించి విద్యుత్తు పరివర్తకాన్ని ఏర్పాటు చేయించారు. అయితే ఏర్పాటు చేసి నెల రోజులవుతున్నా ఇంతవరకు డయాలసిస్‌ కేంద్రానికి కనెక్షన్‌ ఇవ్వలేదు. దీంతో జనరేటర్‌ ఆధారంగానే రోగులకు వైద్యచికిత్సలు అందించాల్సి వస్తోంది. ఈ క్రమంలో రెండు సార్లు జనరేటర్‌ మరమ్మతులకు గురై సేవలు నిలిచిపోయాయి. రోగులను హుటాహుటిన వేరే ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి అధికారులు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.

ప్రైవేట్‌ వాహనాల్లో ఆసుపత్రికి వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న నాగేశ్వరరావు

‌*అంబులెన్స్‌ మాదే.. ఇంజెక్షన్లూ మావే...: నిబంధనల ప్రకారం ప్రభుత్వమే 108 వాహనం లేకుంటే, అంబులెన్స్‌ ద్వారా డయాలసిస్‌ రోగులను గ్రామాల నుంచి ఆసుపత్రికి తీసుకురావాల్సి ఉంది. అయితే ఆ ఊసే కనిపించడం లేదు. రోగులే ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇందుకుగాను నెలకు రూ. 8 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పైగా మందులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. వీటికి మరో రూ. 5 వేలు వరకు వెచ్చిస్తున్నారు. ఇంజెక్షన్లు కూడా బాధితులే బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి. ఈ కారణంగా ప్రభుత్వం ఇచ్చే పింఛను రూ. 10 వేలు ఎటూ సరిపోవడం లేదని.. ఇక పౌష్టికాహారం తీసుకునేది ఎలా అని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బిగించి.. చేతులు దులుపుకొని...

విద్యుత్తు ప్రమాదంలో కాలిపోయిన డయాలసిస్‌ పరికరాలను కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ గత నెల 2న పరిశీలించారు. వెంటనే విద్యుత్తు అధికారులతో కొత్త పరివర్తకాన్ని ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి ఇంత వరకు కనెక్షన్‌ మాత్రం ఇవ్వలేదు. దీంతో చేసేదేమి లేక జనరేటర్‌పై రోగులకు వైద్యచికిత్సలు అందించాల్సిన దుస్థితి. జనరేటర్‌ ఎప్పుడు ఆగిపోతుందో తెలియడం లేదని.. డయాలసిస్‌ కూడా సక్రమంగా చేయడం లేదని పలువురు రోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్తు కనెక్షన్‌ ఇప్పించేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా. అబ్దుల్‌ కలాం మాట్లాడుతూ.. కనెక్షన్‌ గురించి విద్యుత్తు శాఖ అధికారులను అడిగితే ఏవేవో కారణాలు చెబుతున్నారని అన్నారు. విధి లేని పరిస్థితుల్లో జనరేటర్‌ సాయంతో రోగులకు డయాలసిస్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో కేంద్రంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని