logo

తమిళ అభిమానులకు కృతజ్ఞతలు

ధరణి దర్శకత్వంలో విజయ్‌, త్రిష, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Published : 25 Apr 2024 00:18 IST

ప్రకాశ్‌రాజ్‌

చెన్నై, న్యూస్‌టుడే: ధరణి దర్శకత్వంలో విజయ్‌, త్రిష, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రూ.50 కోట్ల వసూళ్లను సాధించిన తొలి తమిళ చిత్రం ఘనతనూ దక్కించుకుంది. విడుదలై 20 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఈనెల 20న రీ రిలీజ్‌ చేశారు. విడుదలైన రెండు రోజుల్లో రూ.10 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇప్పటివరకు రీ రిలీజైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను కురిపించిన సినిమాగా నిలవడం గమనార్హం. ప్రేక్షకాదరణపై నటి త్రిష ఇప్పటికే సామాజిక మాధ్యమ వేదికగా స్పందించారు. ప్రస్తుతం నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా తన ఎక్స్‌ పేజీలో ఓ పోస్టు చేశారు. అందులో... ‘లవ్‌ యు ఆల్‌ చెల్లమ్స్‌. ముత్తుపాండి క్యారెక్టర్‌ను ప్రేమించినందుకు మీ ప్రేమలో నేను పరవశించిపోయాను. దర్శకుడు ధరణి, నిర్మాత రత్నం, మై డియర్‌ విజయ్‌కు, నా గారాల త్రిషకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని తెలిపారు. ‘గిల్లి’లో ముత్తుపాండి క్యారెక్టర్‌లో ప్రకాశ్‌రాజ్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.


మందిరమూర్తి దర్శకత్వంలో మరొక చిత్రం

మందిరమూర్తి

చెన్నై, న్యూస్‌టుడే: మందిరమూర్తి దర్శకత్వంలో శశికుమార్‌ నటించిన ‘అయోద్ది’ గతేడాది విడదలైన విషయం తెలిసిందే. మతసామరస్యం సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సహా పలువురు అగ్రనటులు అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. విడుదలై ఏడాది గడిచిన నేపథ్యంలో దర్శకుడు మందిరమూర్తి మరొక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గోపురం ఫిలిమ్స్‌ తరఫున సుష్మితా అన్బు చెళియన్‌ నిర్మించనున్నారు. నటీనటులు, కథా నేపథ్యం తదితర వివరాలు త్వరలో వెల్లడవనున్నాయని కోలీవుడ్‌ సమాచారం.


నటుల సంఘానికి విరాళం

శివకార్తికేయన్‌

చెన్నై, న్యూస్‌టుడే: నడిగర్‌ సంఘంగా పిలుస్తున్న దక్షిణ భారత నటులసంఘం భవన నిర్మాణ పనులు 2017లో ప్రారంభమై తర్వాత కొన్ని సమస్యలతో ఆగిపోయాయి. పనులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా పలువురు నటులు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే నటులు కమలహాసన్‌, విజయ్‌ రూ.కోటి చొప్పున అందించారు. ఈ నేపథ్యంలో నటుడు శివకార్తికేయన్‌ రూ.50 లక్షల విరాళాన్ని బ్యాంకు చెక్కు రూపంలో సంఘం అధ్యక్షుడు నాజర్‌, కోశాధికారి కార్తిలకు అందించారు.


రెట్ట తల ఫస్ట్‌లుక్‌ విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: అరుణ్‌ విజయ్‌, సిద్ధి ఇద్నాని ముఖ్య తారాగణంగా ఓ చిత్రాన్ని ‘మాన్‌ కరాతే’ దర్శకుడు తిరుకుమరన్‌ తెరకెక్కిస్తున్నారు. టైటిల్‌, పోస్టర్‌ను దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ తన ఎక్స్‌ పేజీలో విడుదల చేశారు. చిత్రానికి ‘రెట్ట తల’ శీర్షిక ఖరారు చేశారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. అరుణ్‌ విజయ్‌ రెండు క్యారెక్టర్లలో కనిపించారు. ‘తడం’ తర్వాత ఆయన రెండు పాత్రలు పోషిస్తున్న చిత్రం ఇది కావడం గమనార్హం.


ఎమక్కు తొళిల్‌ రొమాన్స్‌ టీజర్‌ విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: బాలాజీ కేశవన్‌ దర్శకత్వంలో అశోక్‌ సెల్వన్‌, అవంతిక మిశ్రా జంటగా నటించిన ప్రేమ, హాస్యకథా చిత్రం ‘ఎమక్కు తొళిల్‌ రొమాన్స్‌’. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేసిన నేపథ్యంలో టీజర్‌ను విడుదల చేశారు. విజయ్‌ ఆంటోని తన ఎక్స్‌ పేజీలో విడుదల చేశారు. ఊర్వశి, అళగం పెరుమాళ్‌, ఎం.ఎస్‌.భాస్కర్‌, విజయ్‌ వరదరాజ్‌ తదితరులు నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని