logo

శుభకార్యానికి వెళ్లివస్తూ భార్యాభర్తల మృత్యువాత

ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, చిన్నారి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Published : 05 Jun 2023 03:51 IST

చిన్నారికి గాయాలు

మృతిచెందిన పెద్దయ్య, పావని

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, చిన్నారి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం తెల్లవారుజామున రుషికొండ వద్ద ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి ఆరిలోవ సీఐ సోమశేఖర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని జాలారిపేటకు చెందిన మైలపల్లి పెద్దయ్య (28) తన స్వగ్రామం భోగాపురంలో జరిగిన వివాహానికి శనివారం హాజరయ్యాడు. వివాహం అనంతరం భార్య పావని(24), కుమార్తె(3)తో కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఉదయం సుమారు 6 గంటల సమయంలో రుషికొండ వద్ద వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దీంతో పెద్దయ్య ఎగిరిపడి విభాగినిని ఢీకొన్నాడు. అతని తల బలంగా డివైడర్‌కు తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. పావని, నిషితలకు గాయాలు కావడంతో సమీపంలోని గీతం అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పావని చనిపోయింది. చిన్నారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. పావని, పెద్దయ్య మృతదేహాలను పంచనామా నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పెద్దయ్య పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు.

నిద్ర వల్లేనా?: శనివారం భోగాపురంలో ఓ పెళ్లిలో పాల్గొనడం.. ఆ శుభకార్యం చూసుకొని తిరిగి ప్రయాణమవడంతో నిద్రలేక ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు కునుకు వచ్చి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆరిలోవ సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని