logo

ప్రారంభోత్సవాల సందడి

ఓరుగల్లు నగరంలో బుధవారం మంత్రి హరీశ్‌రావు విస్తృతంగా పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం సిద్దిపేట నుంచి వరంగల్‌కు చేరుకున్న ఆయన.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, భారాస ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి అనేక ప్రారంభోత్సవాలు, సమీక్ష, సభా కార్యక్రమాల్లో రాత్రి వరకు తీరిక లేకుండా పాల్గొన్నారు.

Published : 01 Jun 2023 03:26 IST

మంత్రి హరీశ్‌రావు విస్తృత పర్యటన
ఈనాడు, వరంగల్‌, ఎంజీఎం ఆసుపత్రి, నయీంనగర్‌, బాలసముద్రం, న్యూస్‌టుడే

రుగల్లు నగరంలో బుధవారం మంత్రి హరీశ్‌రావు విస్తృతంగా పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం సిద్దిపేట నుంచి వరంగల్‌కు చేరుకున్న ఆయన.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, భారాస ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి అనేక ప్రారంభోత్సవాలు, సమీక్ష, సభా కార్యక్రమాల్లో రాత్రి వరకు తీరిక లేకుండా పాల్గొన్నారు.
మధ్యాహ్నం 3.30: హంటర్‌ రోడ్డులోని ఫాదర్‌ కొలంబో వైద్య కళాశాలను ప్రారంభించారు. మెరుగైన సేవలు అందిస్తే భవిష్యత్తులో మరిన్ని వసతులు కల్పిస్తామని యాజమాన్యానికి భరోసా ఇచ్చారు.

సాయంత్రం 4.00 గంటలకు: హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి చేరుకుని  ‘టీహబ్‌’ రేడియాలజీ ప్రయోగశాలను ప్రారంభించారు. ఇక్కడ పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు అందించనున్నట్లు తెలిపారు.  57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 తెలంగాణ డయాగ్నస్టిక్‌ హబ్‌లు సేవలందిస్తున్నాయని చెప్పారు. ఆటో అనలైజర్లు, డిజిటల్‌ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌, 2డీ ఏకో, మమోగ్రఫీ అందుబాటులో ఉంటాయని చెప్పారు. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ తదితర పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు.

4.20: కేఎంసీ వైద్య కళాశాలకు చేరుకున్న హరీశ్‌రావు అక్కడ 300 సీటింగ్‌ సామర్థ్యంతో అత్యాధునికంగా నిర్మించిన 4 లెక్చర్‌ హాళ్లు, 500 సీట్ల సామర్థ్యంగల ఎగ్జామినేషన్‌ హాలు ప్రారంభించారు. లెక్చర్‌ హాళ్లలో ఆడియో విజువల్స్‌ను 1981 సుప్రిమోస్‌ పూర్వ విద్యార్థులు రూ. 30 లక్షలతో విరాళంగా అందజేశారు.  

4.40: వరంగల్‌ హెల్త్‌సిటీ పేరుతో నిర్మితమవుతున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాన్ని మంత్రి పరిశీలించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న తీరును కాళోజీ వీసీ కరుణాకర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ పర్యవేక్షక ఇంజినీరు నాగేందర్‌ మంత్రికి వివరించారు.


కార్మికుల సంక్షేమానికి భరోసా

ర్ట్స్‌ కళాశాల ఆడిటోరియంలో సాయంత్రం 6.45 గంటలకు చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఏర్పాటు చేసిన కార్మిక యుద్ధ భేరి సభకు హాజరై మంత్రి హరీశ్‌రావు కార్మికులకు భరోసా ఇచ్చారు. తొలుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ ప్రసంగించారు. గతంలో భాజపా, తెదేపా, కాంగ్రెస్‌ ఎవరూ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని.. ఇప్పుడు కేసీఆర్‌ సర్కారు కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చిందని, త్వరలో కార్మిక భవన్‌ నిర్మిస్తామని వినయ్‌భాస్కర్‌ అన్నారు. చిరు వ్యాపారుల కోసం నగరంలో రూ3.70 కోట్ల వ్యయంతో 3000 వ్యాపారులకు హాకర్స్‌ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. కార్మికుల పిల్లలు ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కార్మికుల కుటుంబం నుంచి ఉన్నతంగా ఎదిగిన విద్యార్థులను సన్మానించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం హరీశ్‌ రావు మాట్లాడుతూ.. కార్మికుల కోసం ఆలోచించే సర్కారు తమదని అన్నారు. వరంగల్‌ పశ్చిమలో కార్మికుల కోసం చేస్తున్న కార్యక్రమాలు దేశంలో మరెక్కడా చేయడం లేదని వినయ్‌భాస్కర్‌ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భారాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని