logo

వివాహేతరబంధానికి అడ్డుగా ఉందని.. చిన్నారిని చంపేసిన కన్నతల్లి!

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కుమార్తెను తల్లే చంపేసింది... పైగా నిద్రలోనే కన్నుమూసిందని బుకాయించింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించింది.

Updated : 12 Jul 2023 09:32 IST

చిన్నారి తన్విత హత్యకేసును ఛేదించిన పోలీసులు

తన్వితతో తల్లి కల్యాణి (పాతచిత్రం)

కాప్రా, న్యూస్‌టుడే:  వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కుమార్తెను తల్లే చంపేసింది... పైగా నిద్రలోనే కన్నుమూసిందని బుకాయించింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించింది. కుషాయిగూడ ఠాణా పరిధిలో ఈ నెల 2న మృతి చెందిన నాలుగున్నరేళ్ల చిన్నారి తన్విత కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లే  హత్యచేసినట్లు తేల్చారు. ఠాణాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ బి.ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ షేక్‌ షఫీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..

కుషాయిగూడ మార్కెట్‌ వద్ద నివాసం ఉండే నాయక్‌వాడి రమేష్‌కుమార్‌ ఆటో డ్రైవర్‌. అదే ప్రాంతానికి చెందిన రాజబోయిన కల్యాణి (22)ని ప్రేమించి 2018లో వివాహం చేసుకున్నాడు. జనగామ జిల్లా నర్మెట్ట ఆమె స్వగ్రామం. ఏడాదికే దంపతులకు కుమార్తె తన్విత (నాలుగున్నరేళ్లు) కలిగింది. తర్వాత కల్యాణి ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్తతో తరచూ గొడవ పడుతూ ఉండేది. 2021 ఫిబ్రవరి నుంచి దంపతులు వేరుగా ఉంటున్నారు. కల్యాణి కూతురు తన్వితతో కలిసి కుషాయిగూడలోని పుట్టింట్లో ఉంటోంది. కూరగాయల మార్కెట్‌లో పనిచేస్తూ కూతురిని స్థానిక ప్రైవేటు స్కూల్లో చదివిస్తోంది. దూరపు చుట్టమైన జనగామ జిల్లా బచ్చనపేట మండలం నారాయణపూర్‌కు చెందిన ఇండ్ల నవీన్‌ (19)తో ఉన్న పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది.

భర్తకు విడాకులు ఇచ్చాక వివాహం చేసుకోవాలనున్నారు. తన్వితను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు. అందులో భాగంగా నెల 1న శనివారం మధ్నాహ్నం స్కూల్‌ నుంచి వచ్చి భోజనం చేసిన చిన్నారిని తల్లి కల్యాణి మంచంపై పడుకోబెడుతున్నట్లు నటిస్తూ దిండును ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఈసీఐఎల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న ఆమె తల్లి రేణుక సాయంత్రం వచ్చిచూసే సరికి మనుమరాలిలో కదలిక లేకపోవడం గమనించగా..  పడుకుందంటూ తల్లితో బుకాయించింది. తరవాత కూతురికి ఆరోగ్యం బాగోలేదని భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది.  ఆస్పత్రికి తీసుకెళ్లి నిద్రపోయిన తన కూతురు లేవడం లేదని, బతికించాలని వైద్యులను బతిమాలుతూ నటించింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కూతురి మృతికి తన భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నెల 2న రమేష్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపట్టి సాంకేతిక ఆధారాలను సేకరించారు. కల్యాణిని విచారించగా నేరం అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన దిండుతో పాటు రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.  ఆమెతోపాటు ప్రియుడు నవీన్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు