logo

పనులన్నీ పొడిగింపు... ఎప్పటికి ఊరడింపు?

సాగునీటి ప్రాజెక్టు పనుల్లో ఏడాదిగా పురోగతి కనిపించడంలేదు. ఏడాది కిందట జిల్లా పరిషత్తు సమావేశానికి సమర్పించిన నివేదికకు.. తాజాగా ఇచ్చిన దానికి ఎలాంటి వ్యత్యాసం కనిపించడంలేదు.

Published : 01 Jun 2023 04:42 IST

ఏడాదిగా పడకేసిన ప్రాజెక్టుల ప్రగతి
నిధుల్లేక నిలిచిన నీటిపారుదల పనులు
సీఎం జగన్‌ ఇలాకాలో దుర్భర పరిస్థితి
ఈనాడు డిజిటల్‌, కడప

సాగునీటి ప్రాజెక్టు పనుల్లో ఏడాదిగా పురోగతి కనిపించడంలేదు. ఏడాది కిందట జిల్లా పరిషత్తు సమావేశానికి సమర్పించిన నివేదికకు.. తాజాగా ఇచ్చిన దానికి ఎలాంటి వ్యత్యాసం కనిపించడంలేదు. ప్రతి సమావేశానికి వివిధ ప్రాజెక్టులపై నివేదిక సమర్పిస్తున్నా ప్రగతి లేకపోవడం గమనార్హం. సీఎం జగన్‌ సొంత ఇలాకాలో దాదాపు అన్ని పనులు స్తంభించిపోయాయి. నిధుల్లేక..బిల్లుల భయంతో గుత్తేదారులు పనులను నిలిపేశారు. స్వయానా సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలోనూ పనులపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. రానున్న సాధారణ ఎన్నికల్లోగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దీంతో పనుల కాల వ్యవధిని పెంచుతూ ఇంజినీరింగ్‌ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల వారీగా పనుల ప్రగతిని పరిశీలిస్తే...!

పులివెందుల బ్రాంచి కెనాల్‌ కింద 45,580 ఎకరాలు, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కుడి కాలువ కింద 39.400 ఎకరాలు, గండికోట ఎత్తిపోతల పథకాల కింద 37,500 ఎకరాలకు సూక్ష్మ నీటి పారుదల అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం 1,22,480 ఎకరాల ఆయకట్టుకు పథకం వర్తింపజేయాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,254 కోట్లు కాగా.. ఈ నెల చివరి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. నిధుల్లేక ఇప్పటికి కేవలం 10.37 శాతం పనులు మాత్రమే చేపట్టారు. వచ్చే డిసెంబరు వరకు గుత్తేదారుకు పనుల కాలవ్యవధిని పొడిగించారు.

చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు ఎత్తిపోతల పథకం కింద 2 వేల క్యూసెక్కులు, పైడిపాలెం జలాశయం ఎత్తిపోతల పథకం కింద 1,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు గండికోట జలాశయం నుంచి పనులు జరుగుతున్నాయి. పథకానికి రూ.3,050 కోట్ల నిధులు అవసరం కాగా, రూ.4.92 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. డిసెంబరు లోగా పనులు పూర్తి కావాల్సి ఉండగా, ఏడాదిగా నిధుల్లేక వచ్చే ఏడాది మార్చి వరకు పనుల వ్యవధిని పెంచారు.

గాలేరు- నగరి సుజల స్రవంతి నుంచి హంద్రీ- నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం కింద ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో నీటి పారుదల కింద 2.91 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు,. 5 లక్షల మందికి తాగునీటి అవసరాలకు తీర్చడం, చిన్ననీటి చెరువులు నింపే పనులు చేపట్టారు. తద్వారా వైయస్‌ఆర్‌లో 91 వేల ఎకరాలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టుకు రూ.4373.23 కోట్లతో టెండరు ఒప్పందం జరిగింది. ఏడాది కాలంలో గొట్టాల సేకరణ పురోగతిలో ఉన్నట్లుగా నివేదికలో ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. కాలేటివాగు రిజర్వాయర్‌ పైపులైను సొరంగం పనులు జరుగుతున్నాయి. ఇప్పటికీ కేవలం 18 శాతం పనులు జరిగాయి. పనులు అక్టోబరుకు పూర్తి కావాల్సి ఉండగా, వచ్చే మార్చికి పొడిగించారు.

గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం కింద కాలువ అభివృద్ధి పనుల్లో భాగంగా 0 నుంచి 56 కిలోమీటర్ల వరకు వెడల్పు, లైనింగ్‌ పనులు చేపట్టారు. తద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని అదనంగా వాడుకునే వీలుంటుంది. ప్రాజెక్టు అంచనా రూ.305.70 కోట్లు కాగా, రెండు ప్యాకేజీలుగా విభజించారు జూన్‌ నాటికి పనులు పూర్తి చేయాలనే ఒప్పందం జరగ్గా, ఇప్పటికి 52.74 శాతం పనులు పూర్తి అయ్యాయి. పనులు 2024, అక్టోబరుకు పూర్తయ్యే అవకాశం లేదు.

వామికొండ 1.66 టీఎంసీలు, సర్వరాయసాగర్‌ 3.06 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించారు. ఉప కాలువల మిగులు పనులు పూర్తి చేసి 35 వేల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ఉప కాలువల కోసం 797 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా ముందుకు కదల్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని