logo

కొండెక్కిన కేంద్రం... మొండిగోడల్లోనే పదిలం!

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో బి.కొత్తకోట మండలం పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో చేపట్టిన క్రీడా శిక్షణ కేంద్రం నిర్మాణం అసంపూర్తిగా మిగిలింది.

Published : 07 Jun 2023 03:02 IST

అయిదేళ్లుగా నిధులకు నిరీక్షణ
అసంపూర్తిగా క్రీడా శిక్షణ కేంద్రం

హార్సిలీహిల్స్‌పై చదును చేసి వదిలేసిన క్రీడా కేంద్రం స్థలం

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో బి.కొత్తకోట మండలం పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో చేపట్టిన క్రీడా శిక్షణ కేంద్రం నిర్మాణం అసంపూర్తిగా మిగిలింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా హిల్‌ స్టేషన్లో శిక్షణ కేంద్ర నిర్మాణానికి క్రీడాశాఖ అయిదేళ్ల క్రితమే శ్రీకారం చుట్టినా తగినన్ని నిధులను కేటాయించకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కొండపై రెవెన్యూశాఖ కేటాయించిన 3.73 ఎకరాల విస్తీర్ణంలో రూ.3.20 కోట్ల వ్యయంతో ఏపీఈడబ్ల్యూఐడీసీశాఖ ఆధ్వర్యంలో 2018లో పనులు మొదలైనప్పటికీ.. ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారు. ఈ కేంద్రం కేటాయించిన భూమిని చదును చేసి ప్రహరీని నిర్మించడం మినహా మిగిలిన నిర్మాణ పనులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.

కొండపైనే ఎందుకంటే...

పర్వత ప్రాంతాల్లో తక్కువ సాంద్రతతో ఆక్సిజన్‌ లభ్యమవుతుంది. పర్వతారోహకులు గాలిని పీల్చుకోవడానికి వారి ఊపిరితిత్తులు అధిక సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇలా కొండలపై సంచారంతో పాటు స్థిరనివాసం ఏర్పరచుకున్న వారి ఊపిరితిత్తుల సామర్థ్యం అసాధారణ రీతిలో వృద్ధి చెందుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రపంచంలోని అనేక దేశాలు కొండ ప్రాంతాల్లో క్రీడాకారులకు శిక్షణను ఇచ్చి మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు శిక్షణ కేంద్రాలను కొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు అవకాశాన్ని కల్పించాయి. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్న ఆంధ్రా ఊటి హార్సిలీహిల్స్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి క్రీడాశాఖ కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం హార్సిలీహిల్స్‌ను సందర్శించి వివిధ ప్రాంతాలను పరిశీలించారు. చివరికి గాలిబండ ఎదురుగా ఉన్న భూమిని ఎంపిక చేశారు. క్రీడాకారులకు వసతి గృహంగా పట్టుశాఖ భవనాలను  తాత్కాలికంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖ టెండర్లను ఆహ్వానించి గుత్తేదారునికి పనులను అప్పగించింది. తొలుత క్రీడాశాఖకు కేటాయించిన భూమిని పక్కన ప్రహరీని కాంక్రీటుతో నిర్మించారు. ఆ తర్వాత భూమిని చదును చేశారు. ఈ పనులు చేసేందుకు రూ.1.60 కోట్లు ఖర్చు చేయగా బిల్లుల చెల్లింపులో జాప్యం చోటు చేసుకుంది. ఈలోగా నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిపోవడంతో పనులను గుత్తేదారుడు ఆపేశారు. వాలీబాల్‌, ఖోఖో, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌ కోర్టులతో పాటు రన్నింగ్‌ ట్రాక్‌, వాకింగ్‌ ట్రాక్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, జిమ్‌, మల్టీపర్సస్‌ భవనాలను నిర్మించడం ఇక మిగిలి ఉంది. ఈ పనులను పూర్తి చేయడానికి మరో రూ.2 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ప్రస్తుతం శిక్షణ కేంద్రానికి కేటాయించిన ప్రాంతాన్ని టౌన్‌షిప్‌ కమిటీ  వాహనాల పార్కింగ్‌ కోసం వినియోగించుకుంటోంది.


త్వరలోనే పనుల ప్రారంభానికి సన్నాహాలు
షేక్‌ షఫీ, చీఫ్‌ కోచ్‌, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటి

అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాలకు కేటాయించిన రూ.1.78 కోట్ల పైకా నిధులు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులను అసంపూర్తిగా ఉన్న హార్సిలీహిల్స్‌ క్రీడాశిక్షణ కేంద్రం పూర్తి చేయడానికి మళ్లించాలని శాప్‌ ఎండీ హర్షవర్ధన్‌ ఆదేశించారు. త్వరలోనే పనులను పునః ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని