logo

Road Accident: ఎస్సై పరీక్షలకు సిద్ధమవుతున్న యువతి.. రోడ్డు ప్రమాదంలో మృతి

ఎస్సై పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఓ యువతి రోడ్డుప్రమాదంలో మృతి చెందింది. మరో యువకుడు ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కూకట్‌పల్లి సీఐ టి.నర్సింగ్‌రావు, మృతురాలి బంధువులు తెలిపిన ప్రకారం.. సంగారెడ్డిలోని

Updated : 17 May 2022 07:14 IST

మూసాపేట, న్యూస్‌టుడే: ఎస్సై పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఓ యువతి రోడ్డుప్రమాదంలో మృతి చెందింది. మరో యువకుడు ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కూకట్‌పల్లి సీఐ టి.నర్సింగ్‌రావు, మృతురాలి బంధువులు తెలిపిన ప్రకారం.. సంగారెడ్డిలోని వీరభద్రానగర్‌కు చెందిన శోభకు ఇద్దరు కుమార్తెలు. భర్త శేఖర్‌ గతంలోనే చనిపోగా పెద్ద కుమార్తె శివాని (21) ఇటీవలే డిగ్రీ పూర్తిచేసింది. ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ కానిస్టేబుల్‌, ఎస్సై పరీక్షలు రాయడానికి సన్నద్ధమవుతోంది. తల్లిని చూడాలని అనిపించి సంగారెడ్డికి వెళ్లిన ఆమె ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తిరిగి దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టల్‌కు వెళ్లడానికి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే అర్ధరాత్రి దాటాక 12.15 గంటల సమయంలో ఆమె తన మిత్రుడైన మహేష్‌తో కలిసి అతని బైక్‌పై జేఎన్‌టీయూ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తుండగా భాగ్యనగర్‌ కాలనీలో ఉషాముళ్లపూడి కమాన్‌ వద్ద మెట్రో పిల్లరు నంబరు 765 వద్దకు రాగానే వెనక నుంచి లారీ వచ్చి బైకును ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిపోయిన శివాని, మహేష్‌లకు తీవ్ర గాయాలవడంతో వారిని కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శివాని అప్పటికే మరణించింది. మహేష్‌ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. శివాని గతంలో బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ సంస్థలో పనిచేసినప్పుడు అక్కడ వీరిద్దరికీ పరిచయం అయినట్లు తెలుస్తోంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై స్నేహారాం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని