నిఘా ఏదీ?
పల్నాడులో వరుస ఘటనలు వైకాపా-తెదేపా వర్గీయుల మధ్య నిప్పురాజేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ, పోటాపోటీ ధర్నాలకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల సమస్యకు దారి తీశాయి. పోలీసులకు తెలియకుండానే ఆ
దత్తత గ్రామాల్లో ప్రజలతో మమేకమైతే ఒట్టు
పల్నాడులో వరుస ఘటనలతో బెంబేలు
గ్రామాల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నెట్వర్క్ ఉంది.. ఒక్కో గ్రామాన్ని ఒక్కో కానిస్టేబుల్కు దత్తత ఇచ్చి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నాం.. పోలీసు ఉన్నతాధికారులు చెప్పేవి ఉత్తి మాటలేనని తేలిపోయింది. తాజాగా జిల్లాలో చోటుచేసుకున్న వరుస ఉదంతాలే అందుకు నిదర్శనం. ఈనెల 13న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెదేపా గ్రామ నాయకుడు తోట చంద్రయ్య హత్య, నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి పట్టుకుపోవడం వంటివి పోలీసుల నిఘా వైఫల్యాన్ని చాటుతున్నాయి.
ఈనాడు, గుంటూరు పల్నాడులో వరుస ఘటనలు వైకాపా-తెదేపా వర్గీయుల మధ్య నిప్పురాజేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ, పోటాపోటీ ధర్నాలకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల సమస్యకు దారి తీశాయి. పోలీసులకు తెలియకుండానే ఆ ఘటనలు చోటుచేసుకున్నాయంటే వారి నిఘా ఎలా ఉందో ఊహించుకోవచ్చు. జనం అంతా చూస్తుండగానే నడిరోడ్డుపై చంద్రయ్యను తల, కాళ్లు పట్టుకుని అత్యంత దారుణంగా హతమార్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అది రాజకీయ హత్యకాదని పోలీసు, అధికార వైకాపా నేతలు బుకాయిస్తున్నారు. వారు చెబుతున్నట్లే రాజకీయ హత్య కాకపోయినా రెండువర్గాల మధ్య పాతకక్షల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రతీకార హత్యే అయినా అది జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులిది కాక మరెవరిదో గుర్తెరగాలి. గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పోలీసుల పరిధిలో ఎక్కడా కూడా దత్తత గ్రామాలు, వార్డులు, డివిజన్ల కాన్సెప్టు విధానం పకడ్బందీగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పట్టు కోల్పోతున్నా పోలీసులు
పోలీసులకు స్టేషన్ పరిధిలోని గ్రామాలు, పట్టణాలపై ఏ మాత్రం పట్టు ఉన్నా హత్యలు, కొట్లాటలకు ఉదంతాలకు తావుండదని అది లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విశ్రాంత పోలీసులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని బాకాలు ఊదుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జరగాల్సిన నష్టం జరిగాక ఎన్ని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా ఆ నష్టాన్ని పూడ్చలేమని అంటున్నారు. అసలు స్టేషన్ పరిధిలో ఏం జరుగుతోంది? ఏ గ్రామంలో ఎలాంటి వాతావరణం ఉందో కనీసం పోలీసులకు సమాచారం లేదంటే అతిశయోక్తి కాదేమో! చంద్రయ్య హత్యగావింపబడిన గుండ్లపాడు, విగ్రహాలు మాయమైన జొన్నలగడ్డ గ్రామాలు రెండూ కూడా స్టేషన్కు ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. స్టేషన్కు అత్యంత సమీపంగా ఉన్న గ్రామాల్లోనే ఇంత దారుణాలకు తెగబడుతున్నారంటే వాటి సూత్ర, పాత్రధారులకు ఏ మాత్రం పోలీసులు అంటే భయం లేదనేది స్పష్టమవుతుంది.
సమస్యలు వినేవారేరీ?
విధి నిర్వహణలో భాగంగా పోలీసులు దత్తత గ్రామాలను తరచూ సందర్శిస్తూ అక్కడ ప్రజలతో మమేకమవుతూ ఉంటే ఆ గ్రామంలో జరిగిన, జరగబోయే అనేక విషయాలు అక్కడి ప్రజలే చెబుతారని కానీ ఈ రకమైన పరిశీలన పోలీసులకు లోపించడంతో గ్రామాల్లో ఏం జరిగినా, జరగబోతున్నా ఎవరికీ చెప్పాలో తెలియక మిన్నకుండిపోతున్నారనే అభిప్రాయం లేకపోలేదు. గ్రామాల్లో పోలీసులు నిరంతరం పర్యటిస్తుంటే వారికి ఏదైనా చెప్పాలనిపిస్తుందని, అడపాదడపా వచ్చిపోతుంటే వారి గురించి తమకు తెలియక తాము వారితో ఏం చెప్పుకో లేకుండా ఉన్నామని ఇటీవల గుండ్లపాడులో చోటుచేసుకున్న హత్యోదంతంపై ఆ గ్రామానికి చెందిన ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళే కాదు.. ఎప్పుడైనా మా గ్రామంలో వైరివర్గాల హడావుడి ఉంటుందని అయినా పోలీసుల పర్యటనలు అంతంత మాత్రమేనని ఆయన వివరించారు. పోలీసులకు గ్రామ రాజకీయాలు, పాతకక్షలు, గ్రూపులపై పట్టు ఉంటే చంద్రయ్య హత్య ముందస్తుగా నివారించదగ్గదేనన్న అభిప్రాయం ఆయా వర్గాల నుంచి వ్యక్తమైంది.
హత్య సంఘటన జరిగిన అనంతరం గుండ్లపాడులో పర్యటిస్తున్న పోలీసు అధికారులు (పాత చిత్రం)
విగ్రహం దొరకలేదాయే
నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఈనెల 13న వైఎస్సార్ విగ్రహం మాయమైంది. ఇది రాజకీయంగా బాగా వివాదస్పదమైంది. వైకాపా, తెదేపా పోటాపోటీ ధర్నాలతో మూడు రోజులు జొన్నలగడ్డ, నరసరావుపేట పట్టణంలో రణరంగాన్ని తలపించాయి. అసలు ఆ గ్రామంలో విగ్రహాలు మాయమయ్యే పరిస్థితి ఉన్నా.. ఒక పథకం ప్రకారం దాన్ని పట్టుకుపోయినా అందుకు కారకులెవరో పోలీసులకు గ్రామ రాజకీయాలపై ఒక అవగాహన ఉంటే కొంతవరకు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చి ఉండేవారు. ఆ కోణంలో విచారణ జరిపి ఉంటే కేసును చేధించేవారు. ఘటన జరిగిన నాలుగు రోజులైనా ఇప్పటికీ విగ్రహం లభ్యం కాలేదంటే పోలీసుల పనితీరు, వారి నిఘా ఎంత తీసికట్టుగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
పర్యవేక్షణ మాటేమిటీ..
స్టేషన్ పరిధిలో ఏం జరుగుతున్నా స్టేషన్ పోలీసులే కాదు.. స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్సీ పోలీసులకు తెలియాలని అనేక దశల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పరచుకొని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇవేం వారి దృష్టికి రాలేదంటే అది నిఘా వైఫల్యమా? ఇంకేమైనా కారణాలా అనేది ఉన్నతాధికారులే గుర్తెరిగి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. సచివాలయాల వ్యవస్థ వచ్చాక గ్రామానికో మహిళా పోలీసు ఉన్నారు. వారికేం తెలియకుండా ఈ ఘటనలు చోటుచేసుకున్నాయంటే నమ్మశక్యం కావడం లేదు. ఇప్పటికైనా దత్తత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించడం, స్టేషన్ పరిధిలో చోటుచేసుకునే సంఘటనలపై ఎప్పటికప్పుడు సమాచారం వచ్చేలా నిఘాను బలోపేతం చేసుకుంటూ విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఉదంతాలు చాటుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..