icon icon icon
icon icon icon

ఐటీ కోటలో నీరే నిప్పు.. ‘బెంగ’ళూరును కుదిపేస్తున్న తాగునీటి ఎద్దడి

భారతీయ సిలికాన్‌ వ్యాలీ, ఉద్యాన నగరి.. బెంగళూరులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు అధికార పార్టీకి, విపక్షాలకూ చెమటలు పట్టిస్తున్నాయి.

Updated : 21 Apr 2024 09:16 IST

ఎన్నికల ప్రచారానికి వెళ్తే ప్రజలు నిలదీస్తారనే భయం
అపార్ట్‌మెంట్లకు ముఖం చాటేస్తున్న అభ్యర్థులు

ఈనాడు, బెంగళూరు: భారతీయ సిలికాన్‌ వ్యాలీ, ఉద్యాన నగరి.. బెంగళూరులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు అధికార పార్టీకి, విపక్షాలకూ చెమటలు పట్టిస్తున్నాయి. ఈ నగరం  పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. దీనికి తోడు ఈ దఫా తెరపైకి వచ్చిన నీటి ఎద్దడి అభ్యర్థులను హడలెత్తిస్తోంది.  

బెంగళూరు పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజక వర్గాలకు ఈ నెల 26న పోలింగ్‌ జరగనుంది. రాజకీయ, ఆర్థిక శక్తి క్షేత్రమైన ఈ ఐటీ నగరంలో పాగా వేసేందుకు ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలు శక్తి వంచన లేకుండా పోరాడుతుంటాయి. స్థానికేతరులదే ప్రాబల్యమైనందున ఓటరు నాడిని పట్టుకోవడం కత్తిమీద సామే. స్థానిక రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోని వలస జీవులు ఎన్నికలంటే తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఆ కారణంగానే ప్రతి ఎన్నికల్లోనూ అతి తక్కువ పోలింగ్‌ నమోదయ్యే తొలి ఐదు జిల్లాల్లో బెంగళూరు నగరం ఉంటోంది.

అయితే, పోలింగ్‌పై ఆసక్తి చూపని ఓటర్లనూ నగరంలో నెలకొన్న నీటి సమస్య కదిలించేలా ఉంది. 40 రోజులుగా నగరంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎన్నికల తేదీ నాటికి ఇది మరింత విజృంభించవచ్చని తెలుస్తోంది. బెంగళూరు నగరమంతా కావేరి నీటిపైనే ఆధారపడి ఉండటంతో కేఆర్‌ఎస్‌ జలాశయంలో నీరు లేని కారణంగా వారానికి ఒక్కసారి కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. ట్యాంకరుకు  రూ.1,500ల నుంచి రూ.2వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. 50ఏళ్లుగా చూడని నీటి సమస్యను నగరం ఎదుర్కోంటోంది. ఈ   పరిస్థితుల్లో అభ్యర్థులు అపార్ట్‌మెంట్‌లు,  మురికివాడల్లో ఓట్ల కోసం స్వేచ్ఛగా వెళ్లలేకపోతున్నారు.

పార్టీల నిందారోపణలు

ఓటింగ్‌పై ప్రభావం చూపే నీటి సమస్యపై భాజపా, కాంగ్రెస్‌లు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది వర్షాలు పడలేదని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని భాజపా ఆరోపిస్తోంది. అనధికారింగా లక్ష బోర్లకు అనుమతి, ట్యాంకర్‌ మాఫియాని అరికట్టలేకపోవటం, కేఆర్‌ఎస్‌ జలాశయంలో నీరు లేకున్నా తమిళనాడుకు నీటిని విడుదల చేసిన సర్కారే ఈ సమస్యకు బాధ్యత వహించాలని భాజపా ప్రచారం చేస్తోంది. బెంగళూరు నగరానికి తాగునీటిని సమృద్ధిగా అందించే మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది. కరువు పరిహారం సకాలంలో చెల్లించని కారణంగానే తాగునీటి సదుపాయాన్ని అందించలేకపోతున్నట్లు కేంద్రంపై ఆరోపణలు చేస్తోంది.

నగరంలో భాజపా పాగా

ఎప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించినా బెంగళూరు నగరంలో భాజపా ఆధిపత్యాన్ని చాటుతూనే ఉంది. 2008కు ముందు బెంగళూరు ఉత్తర, బెంగళూరు దక్షిణలు మాత్రమే బెంగళూరు నగర స్థానాలుగా, రామనగర, చిక్కబళ్లాపురలు గ్రామీణ ప్రాంత స్థానాలుగా పరిగణించేవారు. నాలుగు స్థానాలుగా పునర్విభజన తర్వాత కూడా భాజపా మూడింటిని తన ఖాతాలో వేసుకుని నగరంపై పట్టు కొనసాగిస్తోంది. పునర్విభజనకు పూర్వం రెండు స్థానాల్లో ఒకటి తన ఖాతాలో వేసుకునే కాంగ్రెస్‌ ఆపై పట్టు కోల్పోతోంది. 2009లో ఆ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.



నగర ఓటర్లను ప్రభావితం చేసే మరికొన్ని అంశాలు

వరద నీటి ముంపు, మౌలిక సదుపాయాల కొరత, 60శాతం కన్నడ నామ ఫలకాల నిబంధన, ప్రైవేటు కంపెనీల్లో  స్థానికులకే ఉపాధి, కాంగ్రెస్‌ సర్కారు వచ్చిన తర్వాత పెరిగిన వివిధ పన్నులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img