icon icon icon
icon icon icon

మలివిడతకు వేళాయె.. 88 స్థానాల్లో నేడే పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికల్లో మలి విడతకు రంగం సిద్ధమైంది. ఎండలు ఠారెత్తిస్తున్నవేళ- రెండో దశలో భాగంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది.

Updated : 26 Apr 2024 05:53 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో మలి విడతకు రంగం సిద్ధమైంది. ఎండలు ఠారెత్తిస్తున్నవేళ- రెండో దశలో భాగంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నిజానికి ఈ విడతలో 89 స్థానాలకు పోలింగ్‌ జరగాల్సింది. మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో బీఎస్పీ అభ్యర్థి హఠాన్మరణంతో.. అక్కడ ఓటింగ్‌ను మూడో దశకు మార్చారు. కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లోనూ శుక్రవారమే ఓటింగ్‌ పూర్తికానుంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తదితర ప్రముఖులు ఈ దశలోనే బరిలో ఉన్నారు.

యూపీలో త్రిముఖ పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండో విడతలో 8 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వీటిలో మొత్తంగా 91 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపుగా అన్నిచోట్లా ఎన్డీయే, ఇండియా, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. 2014 నుంచి మథురా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమామాలిని.. ప్రస్తుతం అక్కడ హ్యాట్రిక్‌ విజయంపై గురిపెట్టారు. ముకేశ్‌ ధన్‌గర్‌ (కాంగ్రెస్‌) ఆమెకు ప్రధాన ప్రత్యర్థి. 2009 నుంచి మేరఠ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్ర అగర్వాల్‌ స్థానంలో.. అరుణ్‌ గోవిల్‌కు భాజపా ఈ దఫా టికెట్‌ ఇచ్చింది. ఆయనకు ఇవే తొలి ఎన్నికలు. రాజస్థాన్‌లో బాడ్‌మేడ్‌-జైసల్మేర్‌, జోధ్‌పుర్‌, కోటా-బూందీ, చిథోర్‌గఢ్‌, టోక్‌-సవాయి మాధోపుర్‌, అజ్‌మేర్‌ సహా 13 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వాటిలో 152 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో హ్యాట్రిక్‌ విజయాల కోసం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (కోటా-బూందీ), కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ (జోధ్‌పుర్‌) ప్రయత్నిస్తున్నారు. ఈ విడతతో రాజస్థాన్‌లో ఓటింగ్‌ పూర్తికానుంది. రాష్ట్రంలోని మొత్తం స్థానాలు 25 కాగా, 12 స్థానాలకు తొలి దశలోనే పోలింగ్‌ ముగిసింది.

బరిలో బఘేల్‌

ఛత్తీస్‌గఢ్‌లో మూడు నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలో 30 ఏళ్లుగా భాజపాకు కంచుకోటగా ఉన్న రాజ్‌నంద్‌గావ్‌ స్థానంలో ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ బరిలో దిగారు. అక్కడ కమలదళం సిట్టింగ్‌ ఎంపీ సంతోష్‌ పాండే మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ కుమారుడు. మధ్యప్రదేశ్‌లోని టీకమ్‌గఢ్‌లో వీరేంద్రకుమార్‌ ఖటీక్‌ నాలుగో విజయంపై కన్నేశారు. అక్కడ కాంగ్రెస్‌ కొత్త అభ్యర్థి పంకజ్‌ అహిర్వార్‌ను బరిలో దింపింది. అస్సాంలో కరీమ్‌గంజ్‌, సిల్చార్‌ (ఎస్సీ), దిఫు (ఎస్టీ), నగావ్‌, దరాంగ్‌-ఉదల్‌గురి స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వీటిలో మొత్తం 61 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బిహార్‌లో ముస్లింలు మెజార్టీ వర్గంగా ఉన్న కిషన్‌గంజ్‌ స్థానంతోపాటు పూర్ణియా, కటిహార్‌, భాగల్‌పుర్‌, బాంకా నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరగనుంది.

రెండో విడతలోని 88 నియోజకవర్గాల్లో.. 2019లో 52 స్థానాలను భాజపా, 12 సీట్లను ప్రస్తుత దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు నాడు వీటిలో 23 నియోజకవర్గాలను దక్కించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img