icon icon icon
icon icon icon

చెరిగిపోతున్న వామపక్ష ముద్ర!

దేశంలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు బలోపేతమవుతున్నా.. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ఉన్న వామపక్షాల ప్రాబల్యం మాత్రం విస్తరించడం లేదు.

Updated : 28 Apr 2024 07:04 IST

గత రెండు ఎన్నికల్లో గణనీయంగా తగ్గిన ఓట్లు, సీట్లు

ఈనాడు, దిల్లీ: దేశంలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు బలోపేతమవుతున్నా.. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ఉన్న వామపక్షాల ప్రాబల్యం మాత్రం విస్తరించడం లేదు. తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి 2009 నాటి ఎన్నికల వరకు అవి పోటీ చేసిన స్థానాలు, దక్కించుకున్న సీట్లు, ఓట్లు కాస్త అటూఇటూగా ఒకేస్థాయికి పరిమితమయ్యాయి. పైగా 2014 నుంచి వామపక్షాల ప్రభావం మరింత తగ్గుముఖం పట్టింది.

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా..

1964లో సీపీఐ నుంచి విడిపోయి సీపీఎం పుట్టుకొచ్చింది. అంతకుముందు జరిగిన తొలి మూడు సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ 1962లో గరిష్ఠంగా 29 సీట్లు, 9.94% ఓట్లు దక్కించుకుంది. ఇప్పటికీ ఆ పార్టీకి అత్యుత్తమ ప్రదర్శన అదే. సీపీఎం 2004లో గరిష్ఠంగా 43 సీట్లు గెలుచుకుంది. తొలినాళ్లలో దేశంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు పనిచేశాయి. క్రమంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా భావసారూప్య పార్టీలతో జట్టుకట్టడంతో.. పొత్తులు, సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావాల్సి వచ్చింది.

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత..

వామపక్షాలు 1989 వరకు కాంగ్రెస్‌ వ్యతిరేక భావజాలంతో పనిచేశాయి. ఆ ఏడాది కేంద్రంలో ఏర్పడిన వీపీ సింగ్‌ ప్రభుత్వానికి బయటినుంచి మద్దతిచ్చాయి కూడా. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత వాటి పంథా మారింది. భాజపా వ్యతిరేక విధానాన్ని గట్టిగా ఆచరణలో పెట్టాయి. అప్పటినుంచి కాంగ్రెస్‌కైనా మద్దతివ్వడానికి సిద్ధపడ్డాయే తప్ప.. కమలదళం నీడను కూడా సహించకుండా ముందుకుసాగాయి! దానివల్ల కాంగ్రెస్‌ వ్యతిరేక పాత్రను వామపక్షాలకు బదులు క్రమంగా ప్రాంతీయ పార్టీలు ఆక్రమించాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, ఒడిశాలో బిజద, బిహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌, అస్సాంలో అస్సాం గణపరిషత్‌ పార్టీలు కాంగ్రెస్‌ వ్యతిరేక భావజాల ఓటర్లను తమవైపునకు తిప్పుకోగలిగాయి. హిందూత్వ ప్రభావం అధికంగా ఉండే గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లాంటి రాష్ట్రాల్లో భాజపా బాగా బలపడింది. దాంతో వామపక్షాలు సంప్రదాయబద్ధంగా వస్తున్న పశ్చిమబెంగాల్‌, త్రిపుర, కేరళకే పరిమితం కావాల్సి వచ్చింది. అంతకుమించి విస్తరించే పరిస్థితులను అవి సృష్టించుకోలేకపోయాయి. 1957 ఎన్నికల్లో 9 రాష్ట్రాల్లో సీట్లు సాధించిన సీపీఐ.. 2019 నాటికి ఒకేఒక్క రాష్ట్రానికి పరిమితమైంది. సీపీఎంకు 1991లో అత్యధికంగా 7 రాష్ట్రాల్లో విజయాలు లభించగా, 2019 నాటికి అది 2 రాష్ట్రాలకే పరిమితం కావాల్సి వచ్చింది.


కొత్త నాయకత్వం కొరవడి..

వామపక్షాలు ఇప్పటికీ పేరుకు చాలా రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నా.. విజయాలు మాత్రం విస్తరించడం లేదు. వర్తమాన రాజకీయాల్లో కనిపిస్తున్న డబ్బు, కులం, మతం, ప్రాంతం, అవినీతి పోకడలను ప్రోత్సహించకపోవడంతోపాటు అంతర్గతంగా కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకోలేకపోవడం ఇందుకు మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వామపక్షాల్లో సీపీఎందే పెద్దన్న పాత్ర. పశ్చిమబెంగాల్‌, త్రిపుర, కేరళల్లో ఆ పార్టీ దీర్ఘకాలంపాటు అధికారంలో కొనసాగింది. మిగిలిన వామపక్షాల బలం దీనిపైనే ఆధారపడి ఉంది. పశ్చిమబెంగాల్‌, త్రిపురల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం వల్లే తాము తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆ పార్టీలో అంతర్గత అభిప్రాయం ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో ఎదురైన అనుభవాన్ని గుణపాఠంగా తీసుకొని కేరళలో యువరక్తాన్ని ప్రోత్సహించడంతో.. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం సాధ్యమైందన్న భావన కనిపిస్తోంది. 2004 నుంచి 2014 వరకు యూపీయే ప్రభుత్వ హయాంలో జరిగిన 2జీ, ఇతర కుంభకోణాలు, అమెరికాతో అణు ఒప్పందాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఉద్యమించాయి. కానీ ఆ ఉద్యమాల ఫలితాలను ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో విఫలమయ్యాయి. ప్రస్తుతం వామపక్షాల ప్రాబల్యానికి కేరళ ఒక్కటే కేంద్రంగా మారింది. దాన్ని నిలబెట్టుకోవడంతోపాటు కొత్త ప్రాంతాలకు విస్తరించడం వాటి ముందున్న సవాల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img