icon icon icon
icon icon icon

కన్నడనాట తెలుగు ‘ముద్ర’!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే కర్ణాటకలో తెలుగు ప్రజల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు.

Published : 24 Apr 2024 05:10 IST

కీలక ఓటు బ్యాంకుగా గుర్తింపు
18 స్థానాల్లో ప్రభావితం

ఈనాడు, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే కర్ణాటకలో తెలుగు ప్రజల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థుల గెలుపోటములను తెలుగు ప్రజలు శాసించగలరు. ఈ ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు ఆంధ్ర, తెలంగాణల నుంచి తెలుగు ప్రముఖులను రప్పించి మరీ ప్రచారం చేయిస్తుంటారు. ఈ ఎన్నికల్లోనూ అదే కొనసాగుతోంది.

ఆధిక్యానికి అడ్డుకట్ట

2019 ఎన్నికలను పరిశీలిస్తే 50వేల లోపు ఆధిక్యంలో గెలిచిన మూడు స్థానాలు చామరాజనగర (1,817) కొప్పళ (8,397), తుమకూరు (13,339) కాగా.. వీటిలో రెండింట తెలుగు ఓటర్ల ప్రభావం అధికం. 50వేల నుంచి లక్ష లోపు ఆధిక్యంతో గెలిచిన నాలుగు స్థానాల్లో బళ్లారి (55,707), బెంగళూరు కేంద్రం (70,968) చిత్రదుర్గ (80,178), కలబురగిలలో (95,452) మూడు స్థానాలు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నవే. లక్ష నుంచి రెండు లక్షల లోపు ఆధిక్యం ఉన్న స్థానాల్లోనూ ఎక్కువగా తెలుగు ఓటర్ల ప్రభావాన్ని నేతలు గుర్తించారు. కొద్దిపాటి ఆధిక్యాలు నమోదయ్యే స్థానాల్లో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మకంగా మారడం ప్రతి ఎన్నికల్లోనూ గమనించవచ్చు. వివిధ పార్టీలు తెలుగు వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రముఖులతో ప్రచారాలు చేయించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 5 వేలలోపు ఓట్లతో అభ్యర్థులు ఓడటం, గెలవటం తెలుగు ఓటర్ల ప్రభావంతోనేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

రాజకీయ ఉత్సాహం

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో స్థిరపడిన తెలుగు ఓటర్లకు స్థానిక రాజకీయాలపై ఉత్సాహం పెరగడం గమనార్హం. ఇక్కడి తెలుగు ప్రజలంతా ఐటీ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం వచ్చినవారే. జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకునే సమీకరణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగ్గట్లుగా స్పందిస్తుంటారు. ఐటీ నగరం బెంగళూరులో స్థిరపడిన ఐటీ ఉద్యోగులు ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పోకడలను గమనిస్తుంటారు. కోలారు, తుమకూరు, బీదర్‌, బళ్లారి, రాయచూరు, చిత్రదుర్గ, కొప్పళ, బీదర్‌ ప్రాంతాల్లోని తెలుగువారు ఇక్కడి రాజకీయాలతో మమేకమై ఉంటారు. ఐదేళ్లలో బెంగళూరుకు వచ్చి స్థిరపడిన వారి సంఖ్య అనధికారికంగా 30 లక్షలకు పైగా ఉందని సమాచారం. మొత్తంగా రాష్ట్రంలో దాదాపు ఏడు కోట్లకు చేరిన జనాభాలో కనీసం కోటి మంది తెలుగు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారని అంచనా. గతేడాది సెప్టెంబరులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వేలాది మంది తెలుగు ప్రజలు బెంగళూరు, బళ్లారి, రాయచూరు, కోలారు తదితర జిల్లాల్లో ఆందోళన చేపట్టారు. వీరంతా ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ అంశాలపై సందేశాలు, ప్రచారాలు చేస్తూ తెలుగు ఓటర్లను చైతన్యపరుస్తూ ఉన్నారు. వీరి అభిమానాన్ని గుర్తించిన చంద్రబాబు గతేడాది డిసెంబరులో బెంగళూరులో తెలుగు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ నెల 26న పోలింగ్‌ జరిగేవి: తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, బెంగళూరు దక్షిణ, బెంగళూరు కేంద్ర, ఉత్తర, గ్రామీణం, కోలారు.


తెలుగు ఓటర్ల ప్రభావిత ప్రాంతాలు

మే 7న పోలింగ్‌ జరిగేవి: బళ్లారి, కొప్పళ, రాయచూరు, కలబురగి, బీదర్‌, విజయపుర


ఆంధ్రప్రదేశ్‌ ప్రభావం

ఈనెల 26న రాష్ట్రంలోని 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా ఇందులో కనీసం 8 చోట్ల తెలుగు ఓటర్లు ప్రభావం చూపుతారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల నుంచి స్ఫూర్తి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీయేతో సన్నిహితంగా ఉన్న కారణంగా ఆ పార్టీ అధినేత పిలుపును ఇక్కడి తెలుగు ప్రజలు అందిపుచ్చుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయేలో భాగస్వామిగా మారిన జేడీఎస్‌తో టీడీపీ అధినేత చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉండటం ఈ కూటమి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలదని బెంగళూరు తెదేపా ఫోరం సమన్వయకర్త శ్రీకాంత్‌ వివరించారు. కేవలం తొలి విడత ఎన్నికలే కాదు మలి విడత ఎన్నికల్లోనూ తెలుగు రాష్ట్రాల రాజకీయాల ప్రభావం ఇక్కడి తెలుగు ఓటర్లను ప్రభావితం చేయగలదని అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img