icon icon icon
icon icon icon

Komatireddy Venkatreddy: గతంలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్‌ మోసగించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

Updated : 26 Apr 2024 16:29 IST

హైదరాబాద్‌: ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్‌ మోసగించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారాస హయాంలో ఉపాధిహామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కల్పించలేదన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడం ఆ పార్టీ నేతలు మానుకోవాలన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీశ్‌రావు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

‘‘గతంలో నేను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నా. మెదక్‌లో భారాస కనీసం డిపాజిట్‌ దక్కించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ ఫాంహౌస్‌లో నుంచి బయటకు రాలేదు. ఇప్పుడు కర్ర పట్టుకుని వస్తున్నారు. సచివాలయానికి రేవంత్‌రెడ్డి వచ్చిన దాంట్లో పది శాతం కూడా ఆయన రాలేదు. మూడు నెలల్లో రేవంత్‌ 60 సార్లు సచివాలయానికి వచ్చారు. కేసీఆర్‌ పాలనలో హోంమంత్రికి కూడా అపాయింట్‌మెంట్‌ లేదు. పార్టీ మూతపడే స్థితికి వచ్చినందున ఎక్కడికి వెళ్లాలో వారికి అర్థం కావట్లేదు. రైతులపై ప్రేమ ఉన్నట్లు హరీశ్‌రావు నాటకాలాడుతున్నారు. రాజీనామా పత్రం ఒకటిన్నర పేజీ రాశారు. నిజానికి అది ఒకటిన్నర లైను మాత్రమే ఉండాలి. అంతకు మించితే ఆమోదం పొందదు. 

తెరాస అధికారంలోకి వస్తే తొలి సీఎం దళితుడని నాడు కేసీఆర్‌ చెప్పారు. దళితుడిని సీఎం చేయకపోతే మెడపై తల ఉండదని గొప్పలు చెప్పారు. పరిపాలన అనుభవం ఉండాలని చెప్పి తొలిసారి ఆయనే సీఎంగా ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినా దళితుడిని సీఎం చేయలేదు. అధికారం పోగానే ఆయన పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ వచ్చాక ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నాం. దొంగ రాజీనామా లేఖలను ఎందుకు ఇస్తున్నారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలను క్షమాపణ కోరి ఉండేవాళ్లం. గతంలో నేను పదవి వదులుకున్నా.. పదవులు శాశ్వతమా? రైతులపై ప్రేమ ఉంటే హరీశ్‌రావు రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలి’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img