icon icon icon
icon icon icon

Loksabha polls: ఐదేళ్లకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు: ఓటు హక్కుపై జస్టిస్ డీవై చంద్రచూడ్

సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ప్రజలను కోరారు.

Published : 20 Apr 2024 14:18 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ప్రజలను కోరారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్‌లో భాగంగా ఓ వీడియోను విడుదల చేసింది.

ఇందులో జస్టిస్ చంద్రచూడ్‌ మాట్లాడుతూ ‘‘ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించింది.  అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యత. ఐదు సంతవత్సరాలకు ఒకసారి మన దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించడానికి సాధ్యమవుతుంది కదా. ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతిఒక్కరినీ అభ్యర్థిస్తున్నా. గర్వంగా ఓటు వేద్దాం. నా ఓటు నా వాయిస్‌’’ అని అన్నారు.

 దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే గొప్ప అవకాశం ప్రజలకు ఉందని అందుకే  రాజ్యాంగంలో  ‘భారత ప్రభుత్వం ప్రజలచే, ప్రజల కొరకు’ అని రాసుందని చంద్రచూడ్‌ తెలిపారు. తాను మొదటి సారి ఓటు వేయడానికి చూపిన ఉత్సాహాన్ని, ఓటు వేసినప్పుడు కలిగిన ఆనందాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.  ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు జూన్ 1వరకు జరగనున్నాయి. ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img