Corona: అలా చేస్తే మరింత ముప్పు!

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంతో కొంత పలుకుబడి ఉన్న వ్యక్తులకే ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో  చాలా మంది ‘సొంత వైద్యం’పై దృష్టి పెడుతున్నారు. వైద్యుల సలహాలు తీసుకోకుండానే  తమకు తెలిసిన, అందుబాటులో ఉన్న ఔషధాలను వాడేస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని...

Updated : 06 May 2021 18:06 IST

సొంత వైద్యం వద్దని హెచ్చరిస్తున్న వైద్యనిపుణులు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంతో కొంత పలుకుబడి ఉన్న వ్యక్తులకే ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదంటే పరిస్థితి ఎలాఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో చాలా మంది ‘సొంత వైద్యం’పై దృష్టి పెడుతున్నారు. వైద్యుల సలహాలు తీసుకోకుండానే  తమకు తెలిసిన, అందుబాటులో ఉన్న ఔషధాలను వాడేస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని, దీనివల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ సోకిన వారిలో కేవలం 10-15 శాతం మందికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స తీసుకునే అవసరం ఏర్పడుతోందని, మిగతా వారంతా ఇంట్లోనే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు.

డాక్టర్లను సంప్రదించకుండా యాంటీవైరల్‌, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్‌ మందులను వాడటం వల్ల మరింత ప్రమాదమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర సమయంలో కరోనాకు ఉపయోగించే ఔషధం రెమ్‌డెసివిర్‌కు తీవ్ర గిరాకీ ఏర్పడిన విషయం తెలిసిందే. వివిధ మెడికల్‌ స్టోర్స్‌లోనూ, ఔషధ తయారీ సంస్థ ఔట్‌లెట్లలోనూ ప్రజలు బారులు తీరి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే వైద్యుల సూచన లేకుండా వీటిని వాడటం శ్రేయస్కరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ‘‘ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలిన వెంటనే అతడిలో అనుకోని భయం మొదలవుతోంది. తొందరగా దాని నుంచి బయటపడాలనే ఉద్దేశంతో యాంటీ వైరల్‌ మందుల కోసం పరుగులు పెడుతున్నాడు. దురదృష్ట వశాత్తు డ్రగ్స్‌ విషయంలో సమాచార లోపం తీవ్రంగా ఉంది. దాని గురించి నిజానిజాలను ఎవరూ ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. కొన్ని రకాల మందులు మనుషలకు హాని చేస్తాయన్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. స్టెరాయిడ్లు, రెమ్‌డెసివిర్‌ లాంటి ఔషధాలను ఎక్కువగా వాడితే మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది.’’అని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన  పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.

80శాతం మంది ఇట్టే కోలుకుంటున్నారు

ఇప్పటి నిర్వహించిన వివిధ సర్వేలు, వైద్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొవిడ్ సోకిన వారిలో దాదాపు 80-85 శాతం మంది సులభంగానే కోలుకుంటున్నారు. కేవలం 10-15శాతం మందికి మాత్రమే ఆస్పత్రిలో వైద్యం అందించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. వీరిలోనూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వయోధికులు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ సోకిన వారిలో ప్రధాన సమస్య ఊపిరిత్తులు సరిగా పని చేయకపోవడం, అకస్మాత్తుగా ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడం.  అందువల్ల కొవిడ్‌ సోకినవారు ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోకుండా చూసుకోవాలి. దీనికోసం కాస్త చెట్లున్న ప్రదేశంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడమో, నడవడమో లాంటివి చేయాలి. పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయిలను తెలుసుకోవాలి. 94 పాయింట్ల కంటే తక్కువగా ఉంటేనే ఆస్పత్రికి వెళ్లాలి. లేదంటే ఆ అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


ప్రతిసారీ సీటీ స్కాన్‌ వద్దు

కరోనా విజృంభిస్తుండటంతో ఇటీవల సీటీ స్కాన్లు చేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొందరు వైద్యులు కూడా దీనిని ప్రోత్సహిస్తున్నారు. అయితే సీటీ స్కాన్‌ ద్వారా ఊపిరితిత్తుల పని తీరును మాత్రమే గుర్తించగలమని, ఒకరికి కరోనా సోకిందా ? లేదా? అన్నది సీటీ స్కాన్‌ ద్వారా తెలియదని వైద్యనిపుణలు చెబుతున్నారు. అయితే ఊపిరితిత్తుల పని తీరునుబట్టి కరోనా వైరస్‌ ఊపిరిత్తులకు చేరిందా? లేదా? అన్నది మాత్రం తెలుసుకోవచ్చంటున్నారు. ఒకవేళ కరోనా సోకినా, అది అప్పటికి ఇంకా ఊపిరితిత్తులకు చేరకపోతే.. సీటీ స్కాన్‌లో గుర్తించలేరు.

స్టెరాయిడ్లతో మరింత ముప్పు

స్టెరాయిడ్ల వాడకం వల్ల మరింత నష్టం జరుగుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే వీటిని ఉపయోగించాలని చెబుతున్నారు. అవసరం లేకుండా ఉపయోగించడం వల్ల చాలా మందిలో వైరస్‌ తీవ్రత పెరిగిపోతోందని అంటున్నారు. ‘‘ స్టెరాయిడ్లు వైరస్‌ ప్రతిరూపాలను శరీరంలో అభివృద్ధి చేస్తాయి. వాటిని ఎదుర్కొనేందుకు శరీరం యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది. ముందుగానే స్టెరాయిడ్లు వాడటంవల్ల యాంటీబాడీలు ముందుగానే వృద్ధి చెంది.. మనకు అవసరమైన కణజాలంపై దాడి చేస్తాయి. అంతేకాకుండా వైరస్‌కూడా తన రూపం మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా తీవ్రత పెరిగిపోతుంది’’ అని మరోక వైద్యుడు తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి ఔషధాలు కాలేయం, మూత్రపిండాలు తదితర సమస్యలతో బాధపడేవారికి మరింత హాని చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పౌష్టికాహారం.. వ్యాయామం

కొవిడ్‌ సోకినప్పటికీ వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనలు పాటించాలని, మరీ అవసరం అనుకుంటేనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ, నిత్యం వ్యాయామం చేస్తే కొవిడ్‌ను దూరం చేయవచ్చని అంటున్నారు. కొవిడ్‌ సోకిన వారు ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని, వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఔషధాలు వినియోగించాలని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని