CM KCR: వాళ్లకి రాజకీయాలంటే గేమ్‌.. మాకు మాత్రం టాస్క్‌: కేసీఆర్‌

గతంలో అంతులేని వివక్షతో తెలంగాణ సమాజం నలిగిపోయిందని.. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు ఇదే పరిస్థితి ఉండేదని సీఎం కేసీఆర్‌ అన్నారు

Updated : 09 Mar 2022 10:22 IST

హైదరాబాద్‌: గతంలో అంతులేని వివక్షతో తెలంగాణ సమాజం నలిగిపోయిందని.. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు ఇదే పరిస్థితి ఉండేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉద్యోగాలు రావడం లేదనే తీవ్రమైన నిరాశ, నిర్లిప్తతలో యువత ఉండేదని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభలో కేసీఆర్ మాట్లాడారు. పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించామని.. ప్రజల దీవెనలు, సుదీర్ఘమైన యుద్ధం తర్వాత రాష్ట్రం సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టమని చెప్పారు. 

ఈ మధ్య రాజకీయాల్లో విపరీతమైన పెడధోరణులు వస్తున్నాయని కేసీఆర్ ఆక్షేపించారు. వేరే పార్టీలు, వ్యక్తులకు రాజకీయాలంటే ఒక గేమ్‌ అని.. తమకు మాత్రం ఒక టాస్క్‌ అన్నారు. దాన్ని పవిత్రమైన కర్తవ్యంగా భావిస్తున్నామని చెప్పారు. తాము ఏది తీసుకున్నా.. సీరియస్‌గా తీసుకుంటామన్నారు. రాష్ట్రం తెచ్చిన వాళ్లం తామని.. మేమేం చేశామో ప్రజలకు తెలుసని చెప్పారు. ఉద్యమంలో నమోదైన వాటిలో నిన్న మొన్నటి వరకూ కొంతమంది తమ మంత్రులు కూడా కేసులు ఎదుర్కొన్నారన్నారు. బాధ్యతగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి కాబట్టి ఎన్ని విమర్శలు చేసినా ముందుకెళ్తున్నామని.. సఫలీకృతమయ్యామని చెప్పారు. నాడు నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన సమస్యగా ఉండేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భాషా పరిరక్షణ జరిగిందన్నారు. ఇప్పుడు సినిమాల్లో తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్‌ అవుతున్నారని.. ఒకప్పుడు ఆ భాషను జోకర్లకు వాడేవారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని