తల్లి కోసం తపన: కారు గిఫ్ట్‌ ఇచ్చిన మహీంద్రా

తన జీవితమంతా వంటింటికే పరితమై, కుటుంబ అవసరాలను చూసుకున్న తల్లి రుణం తీర్చుకోవాలనుకున్నాడు ఓ తనయుడు.

Updated : 21 Sep 2020 15:32 IST

మైసూర్‌: తన జీవితమంతా వంటింటికే పరిమితమై, కుటుంబ అవసరాలను చూసుకున్న తల్లి రుణం తీర్చుకోవాలనుకున్నాడు ఓ తనయుడు. అందుకు తగ్గట్టుగా దేశం మొత్తం తిప్పి, తల్లిని ఆశ్చర్యపర్చాలనుకున్నాడు. అభినవ శ్రవణుడిగా మారి 20 ఏళ్లనాటి స్కూటర్‌ను అందుకు ఎంచుకొని, తన ప్రయాణాన్ని సాగించాడు. భారత్ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత ప్రదేశాలను తన తల్లికి తనివితీరా చూపిస్తూ..56,552 కిలో మీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేశాడు. ఈ మాతృప్రేమ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది. ఈ కుమారుడు తల్లి పట్ల చూపిస్తోన్న అభిమానానికి  పొంగిపోయిన ఆనంద్..వారికి ఒక కారు బహుమతిగా ఇస్తానని గత సంవత్సరం వెల్లడించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ శుక్రవారం మహీంద్రా కేయూవీ 100 నెక్ట్స్‌ను వారికి అందజేశారు. 

ఇంతకీ విషయం ఏంటంటే..కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన క్రిష్ణ కుమార్ ఒకప్పుడు కార్పొరేట్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేసేవారు. ఎప్పుడూ ఇంటి బాధ్యతలకే పరిమితమైన తల్లి చూడారత్న రుణం కొంతైనా తీర్చుకోవాలనుకున్నారు. ‘మాతృ సేవా సంకల్ప యాత్ర’ పేరుతో తన తల్లికి కొత్త లోకాన్ని పరిచయం చేయాలనుకున్నారు. అందుకు తగట్టుగానే 20 ఏళ్ల క్రితం తన తండ్రి బహుమతిగా ఇచ్చిన ఓ స్కూటర్‌ను దానికి వినియోగించారు. ఈ ఏడాది జనవరి నాటికి ఆ స్కూటర్‌పై  మొత్తం 56,552 కిలో మీటర్లు ప్రయాణించారు. అయితే, ఈ అభినవ శ్రవణుడి గురించి గత సంవత్సరం అక్టోబర్‌లో ఆనంద్ మహీంద్రాకు తెలిసింది. వెంటనే ఆయన వీరికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ..‘ఇది ఒక అందమైన కథ. తల్లిపై, దేశంపై ఓ వ్యక్తికి ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. ఆయనకు నేను మహీంద్రా కేయూవీ 100 నెక్ట్స్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇకనుంచి తన తల్లిని కారులో తిప్పుతారు’ అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఈ శుక్రవారం కారును బహుమతిగా ఇచ్చి, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 

ఈ బహుమతి గురించి కృష్ణ కుమార్ మాట్లాడుతూ..‘ఇది మా అమ్మకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆమె ఇప్పటికీ నమ్మలేకపోతుంది. మా అమ్మను ఆ కారులో చాముండేశ్వరి ఆలయానికి తీసుకెళ్లాను. కారులోని టచ్‌ స్క్రీన్‌, ఇతర విషయాల గురించి ఎన్నో ప్రశ్నలు అడిగింది. మా అమ్మ చిన్నపిల్లలా మారిపోయింది. స్కూటర్ నుంచి కారు..మా అమ్మకు గొప్ప అనుభవం’ అంటూ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కాకపోతే ఇప్పటి పరిస్థితులు ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో ప్రస్తుతానికి ఇంట్లోనే ఉండనున్నట్లు చెప్పారు. 

ఇదిలా ఉండగా..కారు వచ్చినప్పటికీ, తమకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చిన స్కూటర్‌ను మాత్రం తనతోనే ఉంచుకున్నారు కృష్ణ. అలాగే ఈ కారును సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.  అలాగే ఈ యాత్ర తనను ఆధ్యాత్మికంగా చాలా ప్రభావితం చేసిందని చెప్పిన ఆయన..తన తదుపరి ప్రణాళికను వివరించారు. ఈ కాలం యువతకు మార్గదర్శనం చాలా అవసరమని, ప్రస్తుతం ఆ దిశగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మైసూర్‌లోని తన ఇంటిని ‘జ్ఞాన వికాస కేంద్రం’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. దానిలో తమ యాత్రకు సంబంధించిన వివరాలను పొందుపరచనున్నట్లు తెలిపారు. 

మరోవిషయం ఏంటంటే..ఇన్ని ప్రాంతాలు పర్యటించినప్పటికీ ఆ తల్లీకుమారులు ఒక్కసారి కూడా హోటల్‌లో బస చేయలేదట. దేవాలయాలు, మఠాల్లోనే బసచేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చే పర్యాటకులు తమకు ఎంతో సహకరించారని, వారి రుణం తీర్చుకోలేనిదని తన కృతజ్ఞతను చాటుకున్నారు కృష్ణ కుమార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని