శిరోముండనం ఘటనపై డీజీపీ తీవ్ర ఆగ్రహం

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పోలీస్టేషన్‌లో యువకుడి శిరోముండనం ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 21 Jul 2020 20:31 IST

సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్టేషన్‌లో యువకుడి శిరోముండనం ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. ఇలాంటి వ్యవహారశైలిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.

స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు వెదుళ్లపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిని ఆరెస్టు చేసి సీతానగరం పోలీసులు తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అతడికి శిరోముండనం చేశారు. తీవ్రగాయాల పాలైన అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అధికారులు ఇన్‌ ఛార్జి ఎస్సైతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.

ఇసుక లారీలు అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక మునికూడలి వద్ద వైకాపా నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు.వెదుళ్ల పల్లిలోని బాధితుడు వరప్రసాద్‌ ఇంటికి వెళ్లి కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళన చేపట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని