
CM Jagan: సివిల్ వివాదాలకు స్వస్తి పలకాలన్నదే లక్ష్యం: జగన్
అమరావతి: భూములకు సంబంధించి కొన్ని చోట్ల రికార్డుల్లో ఒక మాదిరిగా.. క్షేత్రస్థాయిలో మరో విధంగా ఉంటోందని సీఎం జగన్ అన్నారు. సివిల్ వివాదాలకు స్వస్తి పలకాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో భూముల రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో 37 చోట్ల దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సేవలను ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
‘‘భూముల ఆక్రమణలు, కబ్జాలు, నకిలీ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేస్తున్నాం. ప్రతి గ్రామంలోని ప్రతి భూమిని 2023 నాటికి సమగ్ర ఆధునిక పద్ధతుల్లో సర్వే చేస్తాం. 2020లో భూసర్వేకు శ్రీకారం చుట్టాం. దాదాపు రూ.1000కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీని కోసం 4,500 బృందాలు పని చేస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే పనులు చేస్తున్నాం. భూ యజమానికి తెలియకుండా రికార్డులు మార్చే ప్రసక్తే ఉండదు. సర్వే చేసేటప్పుడు భూయజమానిని భాగస్వామ్యం చేస్తున్నాం. అభ్యంతరాలు ఉంటే మండల స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు’’ అని జగన్ చెప్పారు.