Kodi Kathi Case: కోడికత్తి కేసు.. నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌

కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు బెయిల్‌ లభించింది. అతడికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 

Updated : 08 Feb 2024 13:41 IST

అమరావతి: కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు బెయిల్‌ లభించింది. అతడికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని శ్రీనివాస్‌ను ఆదేశించింది.

2018 అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై దాడి కేసులో శ్రీనివాస్‌ను పోలీసుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కొద్దిరోజుల క్రితం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని.. దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. తాజాగా శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని