Balakrishna: ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు: నందమూరి బాలకృష్ణ

అఖండ తర్వాత ఎలాంటి సినిమా చేస్తానా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో వీరిసింహారెడ్డిని ప్రేక్షకులకు అందించామని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. 

Updated : 14 Jan 2023 18:15 IST

చంద్రగిరి: ‘వీర సింహారెడ్డి’ సినిమాలో సంభాషణలు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవో కాదో ప్రజలకు తెలుసని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు.  రాష్ట్రంలో ఏం జరుగుతుందో  ప్రజలందరికీ తెలుసని,  ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితిలో  ఉన్నామని  వ్యాఖ్యానించారు. నటుడు, ఎమ్మెల్యే, ఓటరుగా తన అభిప్రాయాలు చెబుతున్నానని తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్వీ థియేటర్‌లో శనివారం బాలకృష్ణ సందడి చేశారు. నారావారిపల్లె నుంచి కారులో చంద్రగిరిలోని ఎస్వీ సినిమాస్‌ థియేటర్‌కి చేరుకున్న బాలకృష్ణకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేయడంతో థియేటర్‌ వద్ద కోలాహలం నెలకొంది. అనంతరం అభిమానులు, నారా, నందమూరి కుటుంబాలతో కలిసి బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాన్ని వీక్షించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘అఖండ తర్వాత ఎలాంటి సినిమా చేస్తానా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో వీర సింహారెడ్డిని ప్రేక్షకులకు అందించాం. ఆకలితో ఉన్న అభిమానులకు మంచి సినిమా అందించాం. ఇది ఫ్యాక్షన్‌ సినిమా కాదు.. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి వీర సింహారెడ్డి చూస్తున్నారు.  సినిమా చూసి చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. ఏ విషయంలో కూడా రాజీ పడకుండా సినిమాను గొప్పగా తీశారు. అభిమానుల కోరిక మేరకు సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దారు. సినిమా అనేది సమష్టి కృషి అని నేనెప్పుడూ నమ్ముతా. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. దర్శకుడు మలినేని గోపిచంద్‌ నా అభిమానిగా తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభిమానుల ఊహలకు తగ్గట్టుగా చిత్రాన్ని తెరకెక్కించారు. తమన్‌ తన సంగీతంతో అదరగొట్టారు. ఆణిముత్యాల్లాంటి పాటలకు మణిపూసలాంటి బాణీలు సమకూర్చారు. బ్యాక్‌ రౌండ్‌ మ్యూజిక్‌ చాలా అద్భుతంగా ఉంది’’ అని బాలకృష్ణ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని