
విజయవాడలో రోడ్డెక్కిన సిటీబస్సులు
విజయవాడ : దాదాపు ఆరు నెలల తర్వాత విజయవాడ రహదారులపై సిటీ బస్సులు తిరుగుతున్నాయి. శనివారం ప్రత్యేకంగా ప్రయోగాత్మక పరిశీలన చేస్తున్నారు. మొత్త ఆరు మార్గాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సులను తిప్పనున్నారు. కోవిడ్19 నిబంధనల మేరకు సీటులో ఒక్కరికి మాత్రమే అనుమతిస్తున్నారు. సిటీ బస్సులు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా నిరుపేదలు, చిరువ్యాపారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిటీబస్సుల్లో కనిష్ఠ ఛార్జీ రూ.5గా ఉండటం వీరందరికీ ఊరట. ప్రస్తుతం 26 వరకు తిప్పుతామని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు తాము హామీ ఇవ్వలేమని ఆర్ఎం నాగేంద్రప్రసాద్ చెప్పారు.. ప్రతి సిటీబస్సులో 60 శాతం ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. ప్రతి స్టాప్ వద్ద ఆర్టీసీకి చెందిన ఉద్యోగి ఉంటారు. శానిటైజ్ చేసుకొని ప్రయాణికులు ఎక్కాల్సి ఉంటుంది. సీటులో ఒక్క ప్రయాణికుడిని మాత్రమే అనుమతిస్తారు. అన్ని సీట్లు భర్తీ అయిన తర్వాత రెండో ప్రయాణీకుడిని అనుమతిస్తారు. మాస్క్ ధరించాల్సి ఉంటుంది. నిలబడి ప్రయాణించడం(స్టాండింగ్) నిషేధం. రాయితీలను అనుమతించరు. ప్రస్తుతం ప్రయోగాత్మక పరిశీలన కోసం 100 బస్సులను మైలవరం, ఆగరిపల్లి, విస్సన్నపేట, పామర్రు, విద్యాధరపురం, మంగళగిరి ప్రాంతాలకు నడుపుతున్నారు.