CM Jagan: కొవిడ్‌తో ఆదాయం తగ్గినా.. ఆస్పత్రుల అభివృద్ధి: జగన్‌

కొవిడ్‌ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.

Updated : 10 Jan 2022 13:53 IST

రాష్ట్రంలో 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించిన సీఎం

అమరావతి: కొవిడ్‌ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 50 పడకలు దాటిన 133 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిమిషానికి 44వేల లీటర్ల మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే 144  పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాటిని జాతికి అంకితం చేసినట్లు వివరించారు.

ప్లాంట్లను ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేస్తోందన్నారు.50 పడకల ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 100 పడకలకు పైగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్లాంట్లకు 30 శాతం రాయితీ ఇచ్చినట్లు తెలిపారు. ఇవన్నీ పూర్తైతే 247 చోట్ల ఆక్సిజన్‌ తయారీకి అవకాశం ఉందని జగన్‌ వివరించారు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్ లైన్లు ఉన్నట్లు జగన్‌ చెప్పారు. 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు.

163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు అందుబాటులో ఉన్నట్లు జగన్‌ చెప్పారు. కనీసం ఒక్క వీఆర్‌డీఎల్‌ ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్‌ వైరల్ (వీఆర్‌డీఎల్‌) ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు జగన్‌ తెలిపారు. ఇప్పటి వరకు 82 శాతం మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని