Corona: జీహెచ్ఎంసీలో ఇంటింటి సర్వే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో కొవిడ్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని..
తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో కొవిడ్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని.. ప్రతి బృందంలో ఇద్దరు మున్సిపల్ స్టాఫ్, ఇద్దరు ఆశా వర్కర్లు, ఒక ఏఎన్ఎం ఉండేలా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులకు స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి తాజా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో కూడా సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తాజా పరిస్థితులపై ఆరా తీశారు.
నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలల్లో ఓపీ సేవలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించే సర్వేలో లక్షణాలు కలిగిన వారిని గుర్తిస్తే వెంటనే వారికి ఈ-క్లీనిక్ల ద్వారా మెడికల్ కిట్లు అందజేయాలన్నారు. వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆ బృందాలే పర్యవేక్షించాలని సీఎస్ స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ, అర్బన్ ఆస్పత్రులు, బస్తీ దవాఖానాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ఆస్పత్రులను వైట్వాష్ చేయించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో కొవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.