TS: కొవిడ్ మార్గదర్శకాలు పాటించాల్సిందే

తెలంగాణలో కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడం పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు

Published : 31 Mar 2021 01:15 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

హైదరాబాద్: తెలంగాణలో కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడం పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి, ఉపాధి హామీ పథకం, హరితహారం, సమీకృత మార్కెట్ల నిర్మాణం, ధరణి, కరోనా, ధాన్యం సేకరణ సంబంధిత అంశాలపై సమీక్షించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రతి మండలానికి చెందిన ప్రత్యేకాధికారులు నర్సరీలను సందర్శించి మొక్కలు బతికేలా చూడాలని చెప్పారు.

సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం అనువైన స్థలాలను కలెక్టర్లు వ్యక్తిగతంగా పరిశీలించి ఎంపిక చేయాలని ఆదేశించారు. రాబోయే ఆరు నెలల్లో వాటి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. ధరణి పోర్టల్ విషయంలో అద్భుతంగా కృషి చేశారని కలెక్టర్లను అభినందించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో తగిన సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. ఏ ఒక్క రైతూ అసౌకర్యానికి గురికాకుండా కలెక్టర్లు చూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని