అత్యధిక శబ్దకాలుష్యం హైదరాబాద్‌లోనే...

హైదరాబాద్‌లో అతి సమ్మర్ధంగా ఉండే ఈ వాణిజ్య ప్రాంతంలో శబ్ద కాలుష్యం దేశంలోకెల్లా అత్యధికమట!

Published : 15 Feb 2020 00:21 IST

దిల్లీ: రోడ్డుపై రెడ్‌ సిగ్నల్‌ పడిన వెంటనే ఎక్కడివారు అక్కడ ఆగిపోతారు.  ఇక గ్రీన్‌ సిగ్నల్‌ పడితే చాలు.. వాహనాలను పోనీయమంటూ వెనుక ఉన్న వాళ్లు ఆపకుండా హారన్లు కొడుతూనే ఉంటారు. హారన్ల వల్ల విడుదలయ్యే భరించలేని శబ్దకాలుష్యానికి విరుగుడుగా ముంబయి పోలీసు శాఖ ‘హాంక్‌ మోర్‌.. వెయిట్‌ మోర్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది.  దీని వల్ల సిగ్నళ్ల వద్ద వాహనాల హారన్లు అధికమయ్యే కొద్దీ ... వారు వేచి ఉండాల్సిన సమయం మరింత పెరుగుతుంది. వినటానికి వింతగా ఉన్నా అక్కడి శబ్ద కాలుష్య తీవ్రతను ఈ చర్య సూచిస్తోంది.

కేంద్ర కాలుష్య నివారణ మండలి దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఉన్న శబ్ద స్థాయిలపై ఒక సర్వే నిర్వహించింది. దీనిలో 2018 చివరి వరకూ అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక శబ్దకాలుష్య నగరంగా హైదరాబాద్‌ టాప్‌లో నిలిచింది. ఇక్కడ శబ్దకాలుష్యం 79 డెసిబల్స్‌గా నమోదైంది. ముఖ్యంగా పారడైజ్‌ జంక్షన్‌లో అత్యధిక శబ్దకాలుష్యం వెలువడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత చెన్నైలో పగటి పూట ధ్వనుల స్థాయి 67.8 డెసిబల్స్‌గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో సగటు శబ్ద స్థాయి 61 డెసిబల్స్‌గా ఉంది. 

నగరాల్లో సాధారణంగానే ఉండే రణగొణ ధ్వనులకు తోడు వాహనాల హారన్లు శబ్ద కాలుష్యానికి మరింత దోహదం చేస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రజలకు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పరిమితికి మించిన శబ్దకాలుష్యానికి లోనవటం అనేక అనర్థాలకు దారి తీస్తుంది. ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడిని పెంచుతుంది. పిల్లల్లో తెలివితేటల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా హృదయ సంబంధ సమస్యలకూ దారి తీయవచ్చు. 

అందుకే జనావాసాల్లో శబ్దస్థాయి పగలు 55 డెసిబల్స్‌, రాత్రి 45 డెసిబల్స్‌ను మించరాదని ప్రభుత్వం నిబంధన విధించింది. కానీ దిల్లీతో సహా మిగిలిన అన్ని నగరాల్లో కూడా శబ్ద కాలుష్యం ఈ పరిమితి కంటే అధికంగానే ఉంది. ‘సైలెన్స్‌ జోన్లు’గా ప్రకటించిన ఆస్పత్రులు వంటి చోట్ల కూడా శబ్ద కాలుష్యం ప్రమాణాలకు మించే ఉంది. ధ్వనుల స్థాయి అతి తక్కువగా ఉందని తెలిసిన ముంబయి ఏఎస్‌హెచ్‌పీ ఆస్పత్రి  ప్రాంతంలో కూడా శబ్ద స్థాయి ప్రమాణాల కంటే ఎక్కువే ఉండటం గమనార్హం! ఇక వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో శబ్దకాలుష్యాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పనవపసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని