ఇచ్చిన పాసులను సమీక్షిస్తాం: డీజీపీ

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో దాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించామని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ అమలుపై

Updated : 20 Apr 2020 19:08 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో దాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించామని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ అమలుపై సీనియర్‌ అధికారులతో సమావేశమై చర్చించామన్నారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. అవసరం లేని వారూ రోడ్లపైకి వస్తున్నట్లు గుర్తించామని అలాంటి వారిని ఎలా నియంత్రించాలనే దానిపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అత్యవసర సేవల కోసం ఇప్పటి వరకు ఇచ్చిన పాసులను సమీక్షించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పాసులను దుర్వినియోగం చేసినట్లు.. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వాటిని రద్దు చేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. అవసరం ఉన్నవాళ్లకు మాత్రమే పాసులు ఇచ్చేవిధంగా.. సమయం, ప్రయాణించే మార్గం కూడా నిర్ణయించేలా కొత్త పాసులు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పాసులు అప్పటి వరకు కొనసాగుతాయని మహేందర్‌రెడ్డి వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కలర్‌ కోడ్‌ ప్రకారం పాసులు

కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తున్నందున వారికి కలర్‌ కోడ్‌ ప్రకారం పాసులు ఇవ్వాలని సంబంధిత కార్యాలయాను కోరుతామని డీజీపీ తెలిపారు. దీనిపై సీఎస్‌కు కూడా లేఖ రాస్తామన్నారు. సోమవారం రెడ్, మంగళవారం గ్రీన్‌, బుధవారం ఎల్లో, గురువారం వైట్‌, శుక్రవారం లైట్‌ పింక్‌, శనివారం బ్లూ కలర్స్‌లో పాసులు ఇవ్వడంతో పాటు ఆయా ఉద్యోగులు ప్రయాణించే రూటును కూడా అందులో పొందుపరచాలని సూచించారు. ఆ పాసుల ప్రకారం ఉద్యోగులు నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నారా లేదా అనే విషయం విధుల్లో ఉన్న పోలీసులుకు సులభంగా అర్థమవుతుందని చెప్పారు. 

అడ్రస్‌ ప్రూఫ్‌ తీసుకురావాలి 

నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెళ్లే వారు 3.కి.మీ దాటకూడదని డీజీపీ అన్నారు. ద్విచక్ర వాహనంపై ఒకరు, కారులో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని.. ఇకపై స్థానిక అడ్రస్‌ ప్రూఫ్‌ను కూడా వెంట తీసుకుని రావాలని సూచించారు. ఆస్పత్రులకు వెళ్లేవారు దగ్గర్లోని ఆస్పత్రులకే వెళ్లాలని.. వారు సైతం అడ్రస్‌ ప్రూఫ్‌ తీసుకుని రావాలన్నారు. దూరంగా ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తే గతంలో సంబంధిత ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలు వెంట తీసుకురావాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని మహేందర్‌ రెడ్డి చెప్పారు. 

సీజ్‌ చేసిన వాహనాలు కోర్టుల్లో డిపాజిట్‌ చేస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా 1.21లక్షల వాహనాలను సీజ్‌ చేశామని డీజీపీ తెలిపారు. ఆయా యజమానులపై కేసులు నమోదు చేసి వాహనాలను న్యాయస్థానాల్లో డిపాజిట్‌ చేస్తామన్నారు. యజమానులంతా లాక్‌డౌన్‌ పూర్తయ్యాక వాటిని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మహేందర్‌రెడ్డి సూచించారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ ఉంటే పరిస్థితి ఇలాగే కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తే మే 7నాటికి కేసులు తగ్గి లాక్‌డౌన్‌ ఎత్తేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. రేషన్‌ దుకాణాలు, బ్యాంకులు, ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడవద్దని చెప్పారు. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని డీజీపీ సూచించారు. కరోనా కట్టడికి గ్రామాల్లో తీసుకుంటున్న చర్యలు మెరుగ్గా ఉన్నాయన్నారు. నగరాలు, పట్టణాల్లోని కాలనీల్లో ఒకే చోట ప్రవేశం ఉండేలా రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ కొనియాడారు. పోలీసులకు వేతనంలో 10శాతం ప్రోత్సాహకంగా ప్రకటించడంపై సీఎం కేసీఆర్‌కు మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని