చుక్క కొనుగోలు చేసిన వారికి చుక్కేస్తారు!
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 80 కిలోమీటర్ల దూరంలో హోషంగాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఓ వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు.
హోషంగాబాద్: కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా ఒకటిన్నర నెలల పాటు మూతబడిన మద్యం దుకాణాలు ఇటీవల మళ్లీ తెరుచుకున్నాయి. మద్యం విక్రయాలు నిర్వహించడానికి కేంద్రం అనుమతించగా.. విక్రయాలకు సంబంధించి హోం శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ దుకాణాల వద్ద రద్దీ ఎక్కువకావటంతో మద్యం కొనుగోలు చేయాలనే ఆత్రంలో తాగుబోతులు సామాజిక దూరం, మాస్కులు ధరించటం లాంటి నిబంధనలకు ‘మందొ’దులుతున్నారు. అంతేకాకుండా కొవిడ్-19 వ్యాప్తి భయాలతో విక్రేతలు కూడా దుకాణాలను తెరిచేందుకు అంతగా ఆసక్తి చూపటంలేదని తెలిసింది. ఇందుకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 80 కిలోమీటర్ల దూరంలో హోషంగాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఓ వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు.
మద్యం కొనుగోలు చేసిన వ్యక్తుల చూపుడు వేలికి చెరగని ఇంకుతో ముద్ర వేస్తున్నామని... భవిష్యత్తులో అవసరమైతే వారిని గుర్తించేందుకు ఈ విధానం పనికొస్తుందని ఎక్సైజ్ అధికారి అభిషేక్ తివారీ తెలిపారు. అంతేకాకుండా మద్యం దుకాణాల వద్ద రిజిస్టర్లను ఏర్పాటు చేశామని... కొనుగోలుదార్లందరూ వారి పేరు, మొబైల్ నంబర్ తదితర వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఆయన వివరించారు. ఈ మేరకు దుకాణదారులతో ప్రభుత్వం ఓ ఒప్పందానికి వచ్చినట్టు ఆయన తెలిపారు. తమ పరిధిలోని కంటైన్మెంట్ జోన్ కాని ప్రాంతాల్లో 50 మద్యం దుకాణాలను తెరిచామని.. ఈ నిబంధన వల్ల మద్యం దుకాణాల వద్ద ప్రజలు ఎగబడటం అదుపులోకి వచ్చిందని అధికారులు వివరించారు. ఈ విధానాన్ని దేశమంతా అమలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.