జూన్‌ మొదటివారంలో ‘టీఎస్‌ బీపాస్‌’:కేటీఆర్‌

భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతే లక్ష్యంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ బీపాస్ కార్యక్రమంపై పురపాలక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ..

Published : 14 May 2020 18:17 IST

హైదరాబాద్‌: భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతే లక్ష్యంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ బీపాస్ కార్యక్రమంపై పురపాలక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టామన్నారు. ఈ మేరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని.. కొన్నింటికి ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. సుమారు 1,100 దరఖాస్తులు వచ్చాయని.. సాఫ్ట్‌వేర్‌ ఆధారిత వ్యవస్థకు సంబంధించి వచ్చిన సమాచారం ఆధారంగా రానున్న 15 రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు కేటీఆర్‌ వివరించారు. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు కేటీఆర్ ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత సిబ్బందికి ఇవ్వాల్సిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. 

రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీలోనూ పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని గ్రేటర్ అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. ఇందుకోసం రానున్న రెండు రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీఎస్ బీపాస్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్‌లైన్‌లోనే అనుమతులు పొందేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని కేటీఆర్ స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే సంబంధిత అధికారులను సంప్రదించేలా ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు అందుబాటులో ఉండే వ్యవస్థను రూపొందించాలని కేటీఆర్‌ ఆదేశించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని